జగన్ ను నమ్ముకున్నవాళ్లంతా జైలుకే : చంద్రబాబు

జగన్ ను నమ్ముకున్నవాళ్లంతా జైలుకే : చంద్రబాబు

గన్నవరంలో ధ్వంసమైన టీడీపీ ఆఫీసును.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పరిశీలించారు. వైసీపీ నేతలు పక్కా ప్లాన్ తోనే టీడీపీ ఆఫీసును ధ్వంసం చేశారని ఆరోపించారు. పెట్రోలు, రాళ్లతో వచ్చి దాడులు చేశారని విమర్శించారు. మొత్తం ఐదు కార్లు, రెండు బైకులను ధ్వంసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు గుండాల్లా వ్యవహరిస్తున్నారని.. టీడీపీ ఆఫీసులో ఫర్నిచర్‭ను ధ్వంసం చేశారని చంద్రబాబు ఆరోపించారు. కొంతమంది పోలీసుల నిర్లక్ష్యం వల్లే వైసీపీ నేతలు దాడులకు తెగబడుతున్నారని చెప్పారు. బాధ, ఆవేదనతో ప్రశ్నిస్తున్నానని.. ఇకనైనా మారండి అంటూ వైసీపీ నేతలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

తాను ప్రజా సంక్షేమం, అభివృద్ది కోసమే అనునిత్యం పనిచేశానని చంద్రబాబు అన్నారు. తమ ఆస్తులపై దాడి చేసి.. తిరిగి కేసులు ఎలా పెడతారని నిలదీశారు. పోలీసులు మొదట్లోనే వైసీపీ నేతల దౌర్జన్యాన్ని అడ్డుకుని ఉంటే ఇలా జరిగేది కాదన్నారు. వైసీపీ నేతల్ని తరిమికొట్టేందుకు ప్రజలంతా ఏకం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. సీఎం జగన్ ను నమ్ముకున్నవాళ్లంతా జైలుకు పోతారని ఆయన ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక వడ్డీతో సహా తిరిగిస్తానని చంద్రబాబు సవాల్ చేశారు. వ్యవస్థలో చీడ పురుగుల్ని తొలగిస్తానని అన్నారు. గన్నవరం మరో పులివెందుల అవుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.