
- పంటపై వాతావరణ మార్పుల ఎఫెక్ట్
- చెడగొట్టువానలు, ఈదురుగాలులతో దెబ్బతింటున్న పంట
- దిగుబడి తగ్గుతుందని రైతుల్లో ఆందోళన
హైదరాబాద్, వెలుగు: వాతావరణంలో వస్తున్న మార్పులతో మామిడితోటలపై ఎఫెక్ట్ పడుతున్నది. నెల రోజుల్లో జరిగిన వాతావరణ మార్పులు మామిడి పూత, కాతను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. మామిడి సీజన్ ప్రారంభంలో పొగమంచు ప్రభావం, చలి తీవ్రతతో పూత, పిందే రాలింది. ఫిబ్రవరి నెల నుంచే అధిక ఉష్ణోగ్రతలు నమోదవడం, తాజాగా చెడగొట్టు వానలు, ఈదురుగాలులతో తోటలపై తీవ్రంగా ఎఫెక్ట్ పడుతున్నది.
దీంతో ప్రస్తుతం చెట్టుపై కాయల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో ఈసారి మామిడి దిగుబడి తగ్గిపోయి నిరాశే మిగల్చనుందని రైతులు అంటున్నారు.
ఉష్ణోగ్రతల ప్రభావంతో
రాష్ట్ర వ్యాప్తంగా 2.89 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఆయకట్టేతర ప్రాంతంలో నిమ్మ, బత్తాయి సాగు తర్వాత మామిడి సాగు ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో 10.50 లక్షల టన్నుల దిగుబడి రావాల్సి ఉంది. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో రైతులు ప్రకృతినే నమ్ముకుని మామిడి తోటలను పెంచుతున్నారు. డిసెంబర్ మాసంలో పూత ప్రారంభం కాగా అదే టైమ్ లో చలి తీవ్రత ఎక్కువగా ఉన్నా, ఉష్ణోగ్రతలు అధికంగా నమోదైనా పూతపై ప్రభావం పడింది. ఈ ఏడాది వాతావరణంలో సాధారణం కన్నా ప్రతికూల మార్పులు ఎక్కువగా చోటుచేసుకున్నాయి. దీంతో పూత విపరీతంగా రాలింది. ఆశించిన దిగుబడి వచ్చే పరిస్థితి లేదని హార్టికల్చర్ వర్గాలు అంటున్నాయి.
ఆందోళనలో రైతులు
రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి తోటలను సాగుచేస్తే, వాతావరణం అనుకూలించకపోవడంతో తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాయ పరిమాణం పెరిగి మార్కెట్లోకి రావడానికి ఇంకో నెల, నెల్నర పడుతుంది. కనీసం వంద రెండు వందల గ్రాములు పెరిగితే కానీ కాయ నిలబడదు. తాజాగా మరికొన్ని రోజుల పాటు ఈదురు గాలులు, వానలు ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతుండడం రైతుల్లో ఆందోళనను పెంచుతోంది. విపరీతంగా గాలి ప్రభావం ఉన్నా, వానలు ఎక్కువైనా దిగుబడి పడిపోతుందని హార్టికల్చర్ ఎక్స్పర్ట్స్ అంటున్నరు.
పావు వంతు దిగుబడి కూడా వచ్చేట్టు లేదు
మాకు 7 ఎకరాల్లో మామిడి తోట ఉంది. వెదర్ ఎఫెక్ట్తో ఇప్పటికే 75శాతం పూత రాలింది. మా ఒక్కరిదే కాదు మా జిల్లా, మాపక్క జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. దిగుబడి పావు వంతు వస్తే ఎక్కువే అని అంటున్నరు
- శ్రీనివాస్, సూదనపల్లి, మహబూబాబాద్ జిల్లా
వాతావరణంలో మార్పులతోనే
నాకున్న భూమిలో 15 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. పూత దశలో విపరీతమైన చలితో పూత బాగా రాలింది. ఇటీవల నీటి సౌలత్ సరిగా లేక చెట్టుకు టైమ్లకు నీరంద కుండా పోయింది. మా ఖమ్మం జిల్లాలో చాలా గ్రామాల్లో బోర్లు ఎండి చెట్లకు నీరు చాలడం లేదు. ఇప్పుడు నీరు చాలక మామిడి పిందెలు ఎదగడం లేదు. కొన్ని చోట్ల రాలిపోతున్నది. వాతావరణంలో మార్పులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఇట్లనే ఉంటే దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుంది.
- బర్రి నర్సిరెడ్డి, చౌటపల్లి, ఖమ్మం జిల్లా
పూత, పిందె దశలోనే దెబ్బ
గత నెల ప్రారంభం నుంచి భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టడంతో చెట్లకు నీరందక మామిడి రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని మహబూబాబాద్ జిల్లా కురవి, మరిపెడ, తొర్రూరు, నర్సింహులపేట మండలాల్లో.. జనగామ జిల్లా పరిధిలోని స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి, జనగామ మండలాలు.. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని పాలేరు, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం ప్రాంతాలు.. ఉమ్మడి నల్గొండ పరిధిలోని కట్టంగూరు, నకిరేకల్, నాంపల్లి, త్రిపురారం, నల్గొండ, సూర్యాపేట, నూతనకల్, ఆత్మకూర్(ఎస్), భువనగిరి, తుర్కపల్లి, అడ్డగూడూరు, కోదాడ తదితర మండలాల్లో ఎక్కువ విస్తీర్ణంలో మామిడి తోటలున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో మామిడి తోటలన్నీ పిందె, కాయ దశలో ఉన్నాయి.