భారతీయ సమాజం లక్షణాలు

భారతీయ సమాజం లక్షణాలు

భారతీయ సాంస్కృతిక వారసత్వం హిమాలయ పర్వత ప్రాంతాల నుంచి వలస వచ్చిన, ఆర్యులు స్థానిక ద్రావిడులు, భారతదేశానికి దండెత్తి వచ్చిన ఇతర జాతుల నాగరికతల సమ్మేళనంతో రూపుదిద్దుకొంది. ఆ రకంగా ఒక రూపాన్ని సంతరించుకొన్న భారతీయ సంస్కృతి ఒకతరం తర్వాత మరో తరం వారికి అందజేశారు. కాని భారతదేశంలో దేశమంతటా ఒకే రకమైన సంస్కృతి కనిపించదు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక జీవన విధానం గోచరిస్తుంది. అందుకే భారతీయ సమాజాన్ని విభిన్న జాతుల, భాషల, మతాల, సంస్కృతుల సమ్మేళనమని చెబుతారు. జాతులు, మతాలు, కులాలు, ఆదిమ తెగలు, భాషలు, ఆచారాలు, సాంప్రదాయాలు, సంస్కృతులు, ఉప సంస్కృతులు, నమ్మకాలు, రాజకీయ, ఆర్థిక, తాత్విక విచారుణల్లో వైవిధ్యతలు స్పష్టంగా గోచరిస్తాయి. ఎన్ని వైరుధ్యాలున్నా ఐక్యతకు కొదవలేదు. 

భౌగోళికపరమైన వైవిధ్యత

భారతదేశానికి ఉత్తరాన హిమాలయాలు, ఇతర ఎత్తయిన పర్వతాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం, పశ్చిమాన అరేబియా సముద్రం, తూర్పున బంగాళాఖాతం సరిహద్దులుగా ఉన్నాయి. ప్రధాన భూభాగం ఎత్తయిన పర్వతాలు, విశాలమైన మైదాన ప్రాంతాలు, ఎడారులు, ద్వీపకల్పాలతో కూడి ఉంది. భారత్​ వ్యవసాయ ప్రధానమైన దేశం. అన్ని రకాల పంటలు పండించడానికి అనువైన భూమి ఉంది. దట్టమైన అడవులు, పర్వత ప్రాంతాలూ ఉన్నాయి. 

గ్రామీణ జీవన విధానం

2011 జనాభా లెక్కల ప్రకారం 67.5 శాతం భారత జనాభా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఇందులో అత్యధికులు వ్యవసాయం, చేతివృత్తులు, గ్రామీణ కుటీర పరిశ్రమలపై ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. గ్రామీణ జీవన విధానమనేది పరస్పర సాన్నిహిత్యం, ముఖాముఖి సంబంధాలు కలిగిన జీవనం. గ్రామీణ జీవితంలో బంధుత్వ సంబంధాలు అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉండి, అవి వారి జీవన విధానంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. భారతీయ సమాజంలో కులపరంగాను, బంధుత్వ సమూహాల పరంగాను, గ్రామాలపరంగాను సంఘటితత్వం కనిపిస్తుంది.

సమష్టి కుటుంబం

సమష్టి కుటుంబం అనేది భారతీయ సమాజం ప్రత్యేక లక్షణం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమష్టి వ్యవస్థ అనేది ప్రబలంగా ఉండేది. గత కొన్ని సంవత్సరాలుగా పారిశ్రామికీకరణ, ఆధునికీకరణల ప్రభావం మూలంగా సమష్టి కుటుంబ వ్యవస్థ విఘటితమవుతున్నది. అయినా నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమష్టి కుటుంబ వ్యవస్థను చూడవచ్చు. హిందూ సామాజిక వ్యవస్థలో సమష్టి కుటుంబమనేది ప్రధానమైంది. 

జాతిపరమైన అంశాలు 

జాతి అనేది ఒక జైవిక సమూహం. ఒకే రకమైన శారీరక లక్షణాలున్న సమూహాన్ని జాతి అంటారు. మానవుల్లో కొన్ని ఉమ్మడి శారీరక వారసత్వ లక్షణాలున్న  వారు ఒక విభాగం కిందికి వస్తారు. శారీరక లక్షణాల్లో వీరు మరో విభాగం వారితో వేరవుతుంటారు. మానవుల్లో కొన్ని శారీరక లక్షణాలను జాతి నిర్ణయకాలుగా నిర్ధారించారు. మానవుల వెంట్రుకలు, శరీర స్థాయి , తల రూపం, ముఖ లక్షణాలు,  చర్మపురంగు, చేతులు, కాళ్ల పొడవు, రక్త సమూహ రకాలు జాతి నిర్ణయకాలుగా చెబుతారు. భారతదేశ జనాభా బహు జాతుల సమ్మేళనం. 

భాషాపరమైన విభిన్నత

భారత రాజ్యాంగం కేవలం 18 భాషలనే అధికారికంగా గుర్తించినప్పటికీ, దేశంలో దాదాపు 1652 భాషలను మాట్లాడుతారు. ఈ భాషలన్నింటిని భాషా సమూహాలుగా వర్గీకరించవచ్చు. ఆస్ట్రిక్​, ఇండో ఆర్యన్​, ద్రవిడియన్​, టిబెటెన్​, యూరోపియన్​, హిందీ, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, ఒరియా, పంజాబీ, బిహారీ, రాజస్తాన్​, అస్సామీ, సంస్కృతం, సింధీ, కాశ్మీరీ మొదలైన భాషలన్నీ ఇండో–ఆర్యన్​ భాషా సమూహం కిందికి వస్తాయి. దేశంలో 75శాతం జనాభా ఇండో  – ఆర్యన్​ సమూహానికి చెందిన భాషలను మాట్లాడతారు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం మొదలైన భాషలు ద్రవిడియన్​ భాషా సమూహం కిందికి వస్తాయి. 

బహుళ మతాలు

దేశంలో చాలా మతాలున్నాయి. ప్రధానంగా హిందూ, ఇస్లాం, క్రైస్తవ, సిక్కు, బౌద్ధ, జైన, జోరాష్ట్రియన్​ మతాలు ఉన్నాయి. అయితే అత్యధికులు హిందూ మతానికి చెందినవారు. చాలా మంది తాత్త్విక వేత్తలు హిందూ మతాన్ని  ఒక జీవన విధానంగా వర్ణిస్తారు. అన్ని మతాలకు కొన్ని విశ్వాసాలుంటాయి. అయితే, అవి ఒకదానికొకటి విభిన్నంగా ఉండవచ్చు. ఆయా మత విశ్వాసాలు విభిన్నమైనప్పటికి వాటన్నింటిలోనూ భగవంతుడు ఒక్కడే. కంటికి కనిపించని భగవంతునిలో విశ్వాసం, వ్యక్తి ఆలోచనా విధానంలో పరిశుద్ధత, దయ అనే సాధారణ భావాలు గోచరిస్తాయి. ఈ భావాలు అన్ని మతాల్లోనూ కనిపిస్తాయి. రకరకాల సంస్కృతులు భారతదేశంలో చాలా రకాలైన సంస్కృతులు విస్తరించి ఉన్నాయి. భారతీయ సమాజం బహు సంస్కృతులతో కూడుకొని ఉన్న సమాజం. విభిన్న మతాలకు చెందిన ప్రజలు వివిధ రకాల ఆచారాలను, సంప్రదాయాలను అనుసరిస్తున్నారు. అయితే విభిన్న మతాలకు చెందిన ప్రజలు విభిన్న రకాలైన ఆచారాలు, సాంప్రదాయాలు పాటిస్తున్నా భారతీయ ప్రజల్లో సాంస్కృతిక ఏకత అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజలు విభిన్న మతాలకు, సమూహాలకు చెందిన వారైనప్పటికీ వారిలో తామంతా భారతీయులమనే భావన ప్రబలంగా ఉంది.  

భిన్నత్వంలో ఏకత్వం

భారతీయ సమాజంలో విభిన్న జాతులు, మతాలు, భాషలు, కులాలు, సంస్కృతులకు చెందిన ప్రజలు ఉన్నారు. దేశ భౌగోళిక పరిస్థితుల్లోను, సామాజిక, రాజకీయ జీవన విధానాల్లోనూ వైవిధ్యతలు ఉన్నాయి. ఈ వైవిధ్యతలతోపాటు భారతీయ సమాజంలో ఏకతకు దోహదపడే శక్తులు ఉన్నాయి. ఉదాహరణకు మనదేశంలో జాతీయ జెండా, జాతీయ గీతం, జాతీయ భాష అనేవి ఉన్నాయి. ఇవన్నీ భారతీయ ప్రజల్లో ఇది మన దేశం, మన ప్రాంతం, తామంతా ఒక్కటే అనే భావన స్ఫురింపజేస్తున్నాయి. ఈ భావనల మూలంగా దేశ ప్రజల్లో ఎన్ని వైవిధ్యతలున్నప్పటికీ ఐక్యత భావమనేది ఏర్పడుతుంది. తద్వారా భారతదేశం ఒక బలీయమైన జాతిగా ఆవిర్భవించింది.

1. కింది వాటిలో భారతీయ సమాజం లక్షణం కానిది? (2) 

1. జాతి, భాష, మతపరమైన వైవిధ్యతలు
2. సజాతీయత 
3. సమష్టి కుటుంబ వ్యవస్థ
4. కుల వ్యవస్థ
2. రిస్లే జాతి వర్గీకరణ ప్రకారం బెంగాలీ 

బ్రాహ్మణులు, కాయస్తులు ఈ జాతి రకానికి చెందినవారు? (2) 


1) ఇండో– ఆర్యన్​లు
2) మంగోలో – ద్రవిడియన్​లు
3) ఆర్యో – ద్రవిడియన్​లు
4) సైతో – ద్రవిడియన్​లు
3. ఏ జాతి వర్గీకరణ ప్రకారం దేశ జనాభాలో నీగ్రిటో లక్షణాలున్నాయని చెప్పారు?  (3) 
1) జె.హెచ్​. హట్టన్​ వర్గీకరణ 
2) హెర్బర్ట్​ రిస్లే వర్గీకరణ
3) బి.ఎస్​.గుహ వర్గీకరణ
4) హడ్డన్​ వర్గీకరణ

కుల వ్యవస్థ 

భారతీయ సమాజంలో కుల వ్యవస్థ అనేది అనాదిగా ఉంది. కుల వ్యవస్థ అనేది భారతీయ సమాజం ప్రత్యేక లక్షణం. భారతీయ సమాజంపై కుల వ్యవస్థ ప్రభావం ఎంతో ఉంది. హిందూ మతానికి చెందిన ఏ వ్యక్తి కూడా ఈ కుల వ్యవస్థ అనే బంధాల నుంచి తప్పించుకోలేడు. కుల వ్యవస్థకు సంబంధించిన నియమ నిబంధనలను ప్రతి ఒక్కరు ఎలాంటి వ్యతిరేకత లేకుండా అంగీకరించాల్సి ఉంటుంది. స్వాతంత్ర్యానికి పూర్వం, స్వాతంత్ర్యానంతరం కూడా కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, కుల వ్యవస్థ నిర్మూలనకు ఎన్నో ఉద్యమాలు జరిగాయి. అయినా నేటికీ కుల వ్యవస్థ బలీయంగా ఉంది.