
- సిట్టింగ్ ఎమ్మెల్సీ జనార్దన్రెడ్డికి షాక్
- సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శుల మీటింగ్లో వాడివేడి చర్చ
హైదరాబాద్, వెలుగు: మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ సెగ్మెంట్లో తమ అభ్యర్థిగా గుర్రం చెన్నకేశవరెడ్డి పేరును పీఆర్టీయూటీఎస్ అధికారికంగా ప్రకటించింది. దీంతో సిట్టింగ్ టీచర్ ఎమ్మెల్సీ జనార్దన్రెడ్డికి షాక్ ఇచ్చినట్లయింది. రాష్ట్రంలోని 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శుల సమావేశం ఆదివారం హైదరాబాద్లో వాడివేడిగా జరిగింది. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీపాల్రెడ్డి, కమలాకర్రావు అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శుల అభిప్రాయాలు సేకరించారు.
సెగ్మెంట్ పరిధిలోని అధ్యక్ష, కార్యదర్శులు.. జనార్దన్రెడ్డికి మద్దతివ్వగా, మిగిలిన జిల్లాలు, ప్రస్తుతమున్న ఆ సంఘం కోర్ కమిటీ సభ్యులు చెన్నకేశవ రెడ్డి పేరును ప్రతిపాదించినట్లు తెలిసింది. అయితే సంఘం ఎమ్మెల్సీగా ఉంటూ పీఆర్టీయూ నాయకులకు వ్యతిరేకంగా ఎందుకు వ్యవహరించారో వివరణ ఇవ్వాలని స్టేట్ లీడర్లు ఆయన్ను నిలదీసినట్లు సమాచారం. దీంతో జనార్దన్రెడ్డి సమావేశం మధ్యలోనే వెళ్లిపోయినట్లు తెలిసింది. కాగా చెన్నకేశవరెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా, టీటీజేఏసీ గా చైర్మన్గా పనిచేశారు. 2017–18 కాలంలో పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. ఈ సమావేశంలో కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి పీఎల్ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.