చెన్నూరులో త్వరలో 100 పడకల ఆస్పత్రి త్వరలో క్లియరెన్స్​ : ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామి

చెన్నూరులో త్వరలో 100 పడకల ఆస్పత్రి త్వరలో క్లియరెన్స్​ : ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామి
  • ప్రజల బాధలను కేసీఆర్ పట్టించుకోలే
  • ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
  • చెన్నూరులో బస్తీ దవాఖాన ప్రారంభం

కోల్​బెల్ట్ /చెన్నూరు/ జైపూర్, వెలుగు: ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు చెన్నూరులో త్వరలో 100 పడకల ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామి తెలిపారు. త్వరలో క్లియరెన్స్​ వస్తుందని, హాస్పిటల్​కు అదనపు స్టాఫ్​ను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు పేర్కొన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా జైపూర్, భీమారం, చెన్నూరు మండలాల్లో ఆయన పర్యటించారు.  చెన్నూరు ఎంపీడీవో ఆఫీస్​ఏరియాలో రూ.13 లక్షలతో నిర్మించిన బస్తీ దవాఖానను ప్రారంభించారు. జైపూర్ మండలం షేట్​పల్లి, శివ్వారం, కిష్టాపూర్, వేలాల, పౌనూర్, కుందారం, నర్సింగాపూర్, బెజ్జల గ్రామాల్లో 198 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను కలెక్టర్​ కుమార్​దీపక్ తో కలిసి అందజేశారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చెన్నూరు మున్సిపాలిటీ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న ఉద్దేశంతో బస్తీ దవాఖానను ప్రారంభించామన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి నియోజకవర్గంలో విద్య, వైద్యం, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించానని తెలిపారు. ఆస్పత్రికి వచ్చే రోగులతో వైద్య సిబ్బంది మర్యాదగా నడుచుకోవాలని సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులు ఆదేశించారు. వార్డుల్లో పూర్తిస్థాయి ఫాగింగ్​చేయాలని, మరికొన్ని ఫాగింగ్ మెషీన్ల కొనుగోలుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తానని చెప్పారు. తాగునీరు కలుషితం కాకుండా  బ్లీచింగ్​పౌడర్​ వాడాలన్నారు. త్వరలో అభివృద్ధి పనులకు టీయూఎఫ్,​ఐడీసీ ఫండ్స్ సాంక్షన్​చేస్తామని తెలిపారు.

ఇండ్లు ఇస్తానని కేసీఆర్ ​మోసం చేసిండు..

బీఆర్ఎస్​హయాంలో ప్రజలకు డబుల్​బెడ్​రూమ్​ఇండ్లు ఇస్తానని మాజీ సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేసిండని ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి అన్నారు. ప్రజల బాధలను పట్టించుకోని ఆయన తన కుటుంబసభ్యుల కోసం 100 పడకల ఫాంహౌస్​లు కట్టించాడని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఇందిరమ్మ ఇండ్లు కట్టించిందన్నారు. ఇప్పుడు మళ్లీ అర్హులైన పేదలకు ఇస్తున్నామని, జైపూర్ మండలానికి మొత్తం 588 ఇండ్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. రెండో విడతలో సొంతింటి స్థలం కలిగిన వారికి ఆర్థిక చేయూతనిస్తామని చెప్పారు. 

లబ్ధిదారులు వెంటనే నిర్మాణాలు చేపట్టాలని, ఇసుకను ఉచితంగా అందిస్తామని పేర్కొన్నారు. సోమనపల్లిలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులకు రూ.8 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. అంతకుముందు జైపూర్, భీమారం మండల కేంద్రాల్లో, చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్​ఆఫీస్​లో చెన్నూరు పట్టణ, మండల, కోటపల్లి మండలాల కాంగ్రెస్ శ్రేణులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం చెన్నూరులో జరిగిన చల్ల సురేందర్ రెడ్డి-–స్వప్న, ముఖం హరీశ్–-వరలక్ష్మి వివాహాలకు హాజరై, వధూవరులను ఆశీర్వదించారు. 

రోడ్లు బాగు చేయించాలని ఎమ్మెల్యేకు వినతి

కోటపల్లి, వెలుగు: మండలంలోని ఆలుగామా నుంచి బొప్పారం, లింగన్నపేట వరకు రోడ్లు సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జనగామ మాజీ సర్పంచ్ గట్టు లక్ష్మణ్ గౌడ్, ఆలుగామ మాజీ సర్పంచ్ కుమ్మరి సంతోష్ తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్​లో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని కలిసి రోడ్లను బాగు చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. స్పందించిన ఆయన రోడ్లు బాగు చేయిస్తానని హామీ ఇచ్చారని వారు తెలిపారు.