మరో 4,021 మందికి ‘చేయూత’ పింఛన్ .. మే నెల నుంచి మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

మరో 4,021 మందికి ‘చేయూత’ పింఛన్ .. మే నెల నుంచి మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • ఇప్పటివరకు అందుతున్న 4,011 మందికి ఇది రెట్టింపు
  • ఈ నెల నుంచి రాష్ట్రంలో 8,032 మంది డయాలసిస్​ పేషెంట్లకు రూ.2,016 చొప్పున అందజేత 

​హైదరాబాద్, వెలుగు: కిడ్నీ సంబంధ సమస్యలు, తలసేమియా, సికెల్​సెల్​వ్యాధులతో బాధపడుతూ రెగ్యులర్​గా డయాలసిస్​ చేయించుకుంటున్న మరికొంతమంది పేషెంట్లకు రాష్ట్ర ప్రభుత్వం ‘చేయూత’ పింఛన్ మంజూరు చేసింది. రాష్ట్రంలో కొత్తగా 4,021 మంది డయాలసిస్​బాధితులకు మే నెల నుంచి పింఛన్ అందించేందుకు నిర్ణయించింది. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఈ ఏడాది ఏప్రిల్​వరకు 4,011 మంది డయాలసిస్​ బాధితులకు మాత్రమే పింఛన్​అందుతుండగా.. మేలో కొత్తగా 4,021 మంది పేషెంట్లకు చేయూత పింఛన్​ మంజూరు చేయడంతో ఒక్కనెలలో ఆ సంఖ్య దాదాపు రెట్టింపు అయింది. ఈ నెల నుంచి రాష్ట్రంలో 8,032 మంది డయాలసిస్​ పేషెంట్లకు రూ.2,016 చొప్పున అందనుంది. 

కిడ్నీ సమస్యలు, తలసేమియా, సికెల్​సెల్​వ్యాధులతో బాధపడ్తూ రెగ్యులర్​గా డయాలసిస్​చేయించుకుంటున్నవారిలో  చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల దాకా ఉన్నారు. వారం, వారం రక్తమార్పిడి చేయించుకోవాల్సి రావడం వల్ల చాలా మంది వ్యయప్రయాసలకు లోనవుతున్నారు. దీంతో తమకూ పింఛన్​ ఇవ్వాలని వారంతా ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నారు. బీఆర్ఎస్​ హయాంలోనూ పెద్దసంఖ్యలో అప్లికేషన్లు వచ్చినప్పటికీ పూర్తిస్థాయిలో పింఛన్లు ఇవ్వలేదు. కానీ, కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక తక్కువ కాలంలోనే పింఛన్లను రెట్టింపు చేయడంపై ఆయా రోగులు, వారి సంబంధీకుల్లో హర్షం వ్యక్తమవుతోంది. 

త్వరలో హెచ్​ఐవీ బాధితులకు పింఛన్?

త్వర‌‌లో మరింత మంది హెచ్‌‌ఐవీ బాధితులకు కూడా పింఛన్లు మంజూరు చేసేందుకు సర్కార్​ కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే దాదాపు 13వేల మంది హెచ్‌‌ఐవీ బాధితులు తమకు పింఛన్లు మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫైల్​ను ఆర్థికశాఖకు పంపించిన  పంచాయతీరాజ్‌‌, గ్రామీణాభివృద్ధి శాఖ అనుమతుల కోసం ఎదురుచూస్తోంది. క్లియరెన్స్​ రాగానే వారికి కూడా పింఛన్​ మంజూరు చేసే అవకాశముంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చేయూత పింఛన్ల కోసం ప్రతి నెలా రూ.993 కోట్ల వరకు చెల్లిస్తోంది. కొత్త పింఛన్​దారుల ఎంపిక పూర్తయితే ఈ మొత్తం భారీగా పెరగనుంది.

జిల్లాల వారీగా ‘చేయూత’ పింఛన్ దారుల వివరాలు ఇలా..

జిల్లా    బాధితుల సంఖ్య
ఆదిలాబాద్    153
భద్రాద్రి– కొత్తగూడెం     267
హనుమకొండ    195
హైదరాబాద్​     848
జగిత్యాల     200
జనగామ     138
జయశంకర్​ భూపాలపల్లి     53
జోగులాంబ గద్వాల     124
కామారెడ్డి     194
కరీంనగర్​     277
ఖమ్మం     285
కుమ్రం భీం ఆసిఫాబాద్    108
మహబూబాబాద్    156
మహబూబ్​ నగర్​     204
మంచిర్యాల     180
మెదక్​     164
మేడ్చల్​మల్కాజిగిరి     705
ములుగు     42
నాగర్​కర్నూల్​     168
నల్గొండ     434
నారాయణపేట     114
నిర్మల్​     122
నిజామాబాద్​     365
పెద్దపల్లి    197
రాజన్న సిరిసిల్ల     134
రంగారెడ్డి     685
సంగారెడ్డి     280
సిద్దిపేట     249
సూర్యాపేట    258
వికారాబాద్​     181
వనపర్తి     108
వరంగల్​     213
యాద్రాద్రి భువనగిరి     231