
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు నవంబర్ 30న తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలు విధిగా సెలవు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేలా సంస్థలు సెలవు ఇవ్వాలని ఆదేశించారు. గత ఎన్నికల వేళ కొన్ని సంస్థలు సెలవు ఇవ్వనట్లు ఫిర్యాదులు వచ్చాయని సీఈవో తెలిపారు. 2018 అసెంబ్లీ, 2019 లోక్సభ ఎన్నికల వేళ సెలవు ఇవ్వనట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. నవంబర్ 30న జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు అన్ని సంస్థలు సెలవు ఇచ్చాయో..? లేదో..? పరిశీలించాలని కార్మిక శాఖకు వికాస్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు. సెలవు ఇవ్వని సంస్థలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మరోవైపు.. తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో బుధ, గురువారాల్లో (నవంబర్ 29, 30 తేదీలు) విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ జరగనుంది. నగరంలోని పలు విద్యాసంస్థల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బుధవారం ఆయా పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రిని తరలించన్నారు. ఈ క్రమంలో విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించారు.