
- కరోనా కంటే ముందు నిలిపివేత
- కొత్త సర్కార్ కూడా ప్రోగ్రామ్ అమలు
- జీహెచ్ఎంసీలో పట్టించుకోని ఆఫీసర్లు
- ప్రజాభవన్కు సిటీ జనాలు భారీగా క్యూ
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. వెంటనే ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి ప్రజావాణి కార్యక్రమం ప్రారంభించి స్వయంగా దరఖాస్తులు స్వీకరించారు. బల్దియా అయితే.. ఇంకా ప్రారంభించట్లేదు. కరోనా కాలంలో ప్రజావాణిని బంద్ పెట్టారు. కొద్ది నెలల తర్వాత తిరిగి షురూ చేశారు. ఇప్పటికే జిల్లాల కలెక్టరేట్లలో నిర్వహిస్తుండగా.. జీహెచ్ఎంసీ మాత్రం నిర్లక్ష్యంగా ఉంటుంది. జీహెచ్ఎంసీ ఆఫీసుల్లో 2020 మార్చి17న కరోనా కారణంగా ప్రభుత్వ ఆదేశాలతో ప్రజావాణిని నిలిపివేశారు. మూడేళ్లుగా ఆసరా పింఛన్లు, రేషన్ కార్డులు, భూమి తదితర సమస్యలతో ఎంతో మంది బల్దియా ఆఫీసులకు వచ్చి వెళ్తుంటారు.
తమ బాధలు చెప్పుకుందామని వస్తే అధికారుల వద్దకు వెళ్లేందుకు ఆఫీసుల్లోకి అనుమతించడంలేదు. కరోనాకు కంటే ముందు ప్రతి సోమవారం బల్దియా ఆఫీసుల్లో ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేవారు. వాటిపై తగు విచారణ చేసి సంబంధిత శాఖల అధికారులు పరిష్కారం చూపేవారు. కొన్ని సమస్యలను వెంటనే సాల్వ్ చేసేవారు. తిరిగి ప్రజావాణిని ప్రారంభించేందుకు అధికారులు ఇంట్రెస్ట్చూపడంలేదు. ఏదైనా ఫిర్యాదు చేయాలంటే ఆన్ లైన్ లో చేయమని సలహాలు ఇస్తున్నారు. హెల్ప్ లైన్నంబర్, మై జీహెచ్ఎంసీ యాప్, ట్విట్టర్, డయల్100 కి ఫిర్యాదు చేసినా కొన్నింటికి పరిష్కారం లభించడంలేదు. కొత్త ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రతి సోమవారం బల్దియాలో ప్రజావాణి నిర్వహించేలా ఆదేశించాలని జనం కోరుతున్నారు.
ప్రజాభవన్ కు బారులు
కలెక్టరేట్ తో పాటు బల్దియాలో ప్రజావాణిని ఒకేసారి నిలిపివేశారు. కలెక్టరేట్ లో తిరిగి నిర్వహిస్తున్నారు. బల్దియలో నిర్వహణపై కనీసం అధికారులు ఆలోచన కూడా చేయడంలేదు. ప్రజల సమస్యలను బాధ్యతాయుతంగా పరిష్కరించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా ఉంటూ పట్టించుకోవడంలేదు. మేడ్చల్, హైదరాబాద్ , రంగారెడ్డి జిల్లాల కలెక్టరేట్ లో ప్రజావాణి తిరిగి ప్రారంభించారు. బల్దియాలో నిర్వహణను అధికారులు గాలికొదిలేశారు.
ప్రజావాణి నిర్వహిస్తే తమ సమస్యలు పరిష్కారమైతాయని ప్రజలు కోరుతున్నారు. దీంతో బల్దియా ఆఫీసుల్లో ప్రజావాణి నిర్వహించకపోతుండగా నగరవాసులు ప్రజాభవన్కు క్యూ కడుతున్న పరిస్థితి నెలకొంది. ప్రజాభవన్ వద్ద బల్దియా కమిషనర్ ఉండి మరి ఫిర్యాదులు తీసుకుంటున్నారు. కానీ బల్దియాలో మాత్రం ప్రజావాణి నిర్వహణపై ఎలాంటి సమాధానం ఇవ్వడంలేదు. అధికారులు పని తప్పించుకోడానికే ప్రజావాణి నిర్వహించడంలేనట్లుగా కనిపిస్తుంది.
నిర్వహణకు అధికారులపై ఒత్తిడి
బల్దియా ఆఫీసుల్లో ప్రజావాణి ప్రారంభిస్తే ప్రజలకు చాలా మేలు జరగనుంది. వెంటనే నిర్వహణకు చర్యలు తీసుకోవాలని జనం కూడా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారంటే, దాని ద్వారా ప్రజలకు ఎంత మేలు కలుగుతుందో అర్థం చేసుకోవాలి. ఏదైనా బల్దియా అధికారులను కలిసేందుకు వస్తే ఎప్పుడు ఉంటారో, ఎప్పుడు ఉండరో తెలియని పరిస్థితి. అదే ప్రజావాణి నిర్వహిస్తే అక్కడ తప్పనిసరి అధికారులు ఉంటారు. గతంలో ప్రజావాణి నిర్వహించిన సమయంలో ప్రతివారం వందలాది సమస్యలకు తక్షణమే పరిష్కారం లభించేంది. దీంతోనే ప్రజావాణికి ఆదరణ పెరిగింది. కరోనా కారణంగా నిలిపివేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తిరిగి ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.