- చేనేత చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు చిక్కా దేవదాసు డిమాండ్
ముషీరాబాద్, వెలుగు: చేనేత వస్త్ర ఉత్పత్తులు, ముడి సరుకులపై కేంద్రం వెంటనే జీఎస్టీని పూర్తిగా తొలగించి.. ఈ రంగాన్ని కాపాడాలని చేనేత వర్గాల చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు చిక్కా దేవదాసు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దళిత బంధు తరహాలో చేనేత బంధు ప్రవేశ పెట్టి వెంటనే నేతన్నలకు రూ.10 లక్షలు ఇవ్వాలని కోరారు. బాగ్ లింగంపల్లి లోని చైతన్య వేదిక ఆఫీసులో సోమవారం జాతీయ చేనేత దినోత్సవాలను నిర్వహించారు.
ఈ సందర్భంగా దేవదాస్ మాట్లాడుతూ.. ఇప్పటికైనా రాష్ట్ర బడ్జెట్లో చేనేత రంగానికి రూ. వెయ్యి కోట్లు కేటాయించాలని, చేనేత మ్యూజియం ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతి కార్మికుడికి నెలకు రూ. 15 వేలు జీవన భృతి చెల్లించాలన్నారు. చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో చైతన్య వేదిక హైదరాబాద్ కత్తుల సుదర్శన్ రావు, యాదాద్రి జిల్లా పద్మశాలి నాయకులు రచ్చ శ్రీనివాస్ పాల్గొన్నారు.