నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కాల్పోల్ తండాలో దారుణం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేస్తున్నాడని యువకుడిపై సర్పంచ్ రవి దాడి చేశాడు. మోపల్ మండలం కాల్పోల్ తండాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొదటగా ఇన్స్టాగ్రామ్ రీల్ చేసిన జనార్ధన్పై దాడి చేసిన సర్పంచ్.. ఆ తర్వాత జనార్ధన్ కుటుంబంపై కూడా దాడి చేయడంతో తండాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
జనార్ధన్ అన్నయ్య అయిన.. శ్రీకాంత్, అమ్మ, పెద్దమ్మ, అక్కాచెల్లెళ్లపై కారం పోసి సర్పంచ్ రవి కుటుంబం దాడి చేసింది. ఈ దాడిలో జనార్ధన్ అన్న శ్రీకాంత్, చెల్లె, తల్లి బంధువులు తీవ్రంగా గాయపడ్డారు. సర్పంచ్ అరాచకంపై సీపీ సాయి చైతన్యకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు.
సర్పంచ్ దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పాత కక్షల నేపథ్యంలో సర్పంచ్ కుటుంబం జనార్ధన్ కుటుంబంపై దాడి చేసి ఉండొచ్చనే అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన తండాకు వెళ్లిన పోలీసులు ప్రత్యక్ష సాక్షులను అడిగి ఈ ఘటన గురించి వివరాలు తెలుసుకున్నారు. ఈ రెండు కుటుంబాల మధ్య గతంలో ఏమైనా గొడవలు ఉన్నాయో.. లేదో.. గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు.
