మూడేండ్ల తర్వాత తల్లి చెంతకు బాలుడు : పిల్లల కిడ్నాప్ ముఠా అరెస్టు  

మూడేండ్ల తర్వాత తల్లి చెంతకు బాలుడు : పిల్లల కిడ్నాప్ ముఠా అరెస్టు  

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో చిన్న పిల్లలను కిడ్నాప్​ చేసి అమ్ముతున్న ముఠా సభ్యులు ముగ్గురిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఆదివారం జిల్లా పోలీసు ఆఫీసులో  వివరాలను ఎస్పీ శ్వేత మీడియాకు వెల్లడించారు. కామారెడ్డికి చెందిన ఎస్ కె. నజీర్​ పెయింటర్​గా పని చేస్తుంటాడు. ఇతని భార్య యాస్మిన్​ అలియాస్​వసీమా బేగం, వీరికి పరిచయమున్న షబానా బేగం ఇళ్లలో పని చేస్తుంటారు. ఖర్చులకు డబ్బులు సరిపోక  చిన్న పిల్లలను కిడ్నాప్​ చేసి అవసరమున్నవారికి అమ్మేందుకు ముఠాగా ఏర్పడ్డారు. రోడ్లపై ఆడుకునే చిన్నారులను ఆడవాళ్లు ఎత్తుకుపోయి నజీర్​కు ఇచ్చేవాళ్లు. అతను ఆ పిల్లలను అమ్మేవాడు. 13 ఏప్రిల్​2018న భారత్​ రోడ్డుకు చెందిన గోపి కొడుకు గణేశ్(3)​ను ముఠా సభ్యులు కిడ్నాప్​ చేశారు. హైదరాబాద్​కు చెందిన మహ్మద్​ యూసుఫ్​అలీకి అమ్మేశారు.  ఈ నెల 2న ముఠా సభ్యులు భారత్​ రోడ్డులో అనుమానాస్పదంగా తిరుగుతుండటం, గతంలో కిడ్నాప్​కు గురైన బాలుని గురించి అడుగుతుండడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. వెంటనే  పోలీసులకు సమాచారం ఇచ్చారు. టౌన్​ పోలీసులు అక్కడకు వెళ్లి ముఠా సభ్యులు ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించగా కిడ్నాప్ ​విషయం బయటపడింది. బాలుడిని తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. 2015లో  కామారెడ్డి రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని మహిళ నుంచి ఎత్తుకుపోయిన ఓ బాలుడి ఆచూకీ తెలియాల్సి ఉందని ఎస్పీ పేర్కొన్నారు. 2018లో హాస్పిటల్​ నుంచి ఓ బాలుడిని కిడ్నాప్​ చేసిన కేసులో గతంలో వీరిని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ ముఠాపై ఇంకా ఇతర జిల్లాల్లో కిడ్నాప్​కేసులు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. నజీర్, యాస్మిన్, షబానాను రిమాండ్​కు తరలించారు.