V6 News

ఓసీ3 డంప్యార్డులో చిన్నారి డెడ్బాడీ

ఓసీ3 డంప్యార్డులో చిన్నారి డెడ్బాడీ
  •     జయశంకర్​ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం ధర్మారావుపేటలో బాలుడు అదృశ్యం
  •     ట్రాక్టర్ పైనుంచి కింద పడి చనిపోగా డంప్​యార్డులో పడేసిన ట్రాక్టర్​ ఓనర్


జయశంకర్​భూపాలపల్లి, వెలుగు: జయశంకర్​ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం ధర్మారావుపేటలో ఆదివారం అదృశ్యమైన బందెల రాకేశ్(5) డెడ్​ బాడీ మంగళవారం ఓసీ3 డంప్​యార్డులో లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన  బందెల రాజు, రజిత దంపతుల కొడుకు రాకేశ్​ ఇంటి వద్ద ఆడుకుంటుండగా, వరి కోత పనులకు వెళ్తున్న అదే గ్రామానికి చెందిన గంపల శంకర్​ తన ట్రాక్టర్​లో రాకేశ్​తో పాటు మరో బాలుడిని ఎక్కించుకున్నాడు. ప్రమాదవశాత్తు రాకేశ్​ ట్రాక్టర్​ టైర్ల కింద పడి స్పాట్ లోనే చనిపోయాడు.

 రాకేశ్​ చనిపోయాడనే భయంతో శంకర్​ బాలుడి డెడ్​బాడీని గన్నీ సంచీలో చుట్టి సమీపంలోని ఓసీ3 డంపింగ్ యార్డులో పడేసి, ఏమీ తెలియనట్లు ఇంటికి వచ్చాడు. రాకేశ్​ రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు గ్రామంలో వెతికారు. శంకర్​ తన ట్రాక్టర్ పై రాకేశ్​ను ఎక్కించుకోవడం చూసిన గ్రామస్తులు అతడిని నిలదీయగా, అతను పొంతన లేని సమాధానం ఇవ్వడంతో గణపురం పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పోలీసులు శంకర్​ను విచారించగా విషయం బయటకు వచ్చింది. మట్టికుప్పలు వేయడంతో జేసీబీ సాయంతో మట్టిని తొలగించి డెడ్​బాడీని బయటకు తీశారు. ఘటనా స్థలాన్ని సీఐ సీహెచ్​ కరుణాకర్​రావు, తహసీల్దార్​ సత్యనారాయణస్వామి, ఎస్సై అశోక్​ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.