సంక్రాంతికి ముందు హైదరాబాద్ సిటీని చైనా మాంజా కలకలం రేపుతోంది నిషేధం ఉన్నప్పటికీ సింథటిక్, చైనా మాంజా అమ్మకాలు, వాడకం యథేచ్చంగా సాగుతోంది. దీంతో హైదరాబాద్ లో రోడ్లపై వెళ్లాలంటేనే బయపడుతున్నారు వాహనదారుల .
డిసెంబర్ 29న హైదరాబాద్ లో చైనా మాంజా తగిలి మరో యువకుడి గొంతు కోసుకుపోయింది. హైదరాబాద్ – శంషీర్గంజ్ ప్రాంతంలో బైక్పై వెళ్తుండగా చైనా మాంజా మెడకు తగిలి, గొంతు కోసుకపోయి తీవ్ర గాయాలపాలయ్యాడు నవాబ్ సాహెబ్ కుంట ప్రాంతానికి చెందిన జమీల్ అనే యువకుడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు వైద్యులు.
డిసెంబర్ 26న చైనా మాంజా మెడకు చుట్టుకోవడంతో మేడ్చల్ జిల్లా కీసర మల్లికార్జున నగర్కాలనీకి చెందిన బీటెక్ స్టూడెంట్ జశ్వంత్రెడ్డి కీసర ఎస్సీ కాలనీ పక్కనున్న తన పొలానికి బైక్ పై వెళ్తున్నాడు. ఆ టైంలో కొందరు పతంగులు ఎగురవేస్తున్నారు. ఒక పతంగికి ఉన్న చైనా మాంజా జశ్వంత్ మెడకు చుట్టుకుంది. దాన్ని గమనించకుండా కొంచం దూరం ముందుకు పోవడంతో మెడను పావు శాతం కోసేసింది. దీంతో బైక్ పై నుంచి పడిపోయిన జశ్వంత్ను స్థానికులు హాస్పిటల్కు తరలించారు. డాక్టర్లు 19 కుట్లు వేసి ట్రీట్మెంట్ చేశారు.
మరో వైపు చత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో చైనా మాంజా అక్రమ విక్రయాలపై కఠిన చర్యలు తీసుకున్నారు పోలీసులు. డిసెంబర్ 29న రెండు కేసుల్లో 24 చైనా మాంజా బాబిన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై BNS సెక్షన్లు, పర్యావరణ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ప్రజల ప్రాణాలకు, పిల్లలకు, పక్షులు, జంతువులు, పర్యావరణానికి ప్రమాదకరమని తెలిపారు. చైనా మాంజా కొనుగోలు, విక్రయం, వినియోగం చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎక్కడైనా అక్రమ విక్రయాల సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. నిషేధిత చైనా మాంజాకు దూరంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు
