ఢాకా: బంగ్లాదేశ్లో నిర్బంధంలో ఉన్న హిందూ సన్యాసి, ‘సమ్మిలిత సనాతని జాగరణ్ జోటే’ ప్రతినిధి బ్రహ్మచారి చిన్మయ్ కృష్ణ దాస్కు న్యాయస్థానంలో చుక్కెదురైంది. 2024లో జరిగిన జూనియర్ లాయర్ సైఫుల్ ఇస్లాం అలిఫ్ హత్య కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను బంగ్లాదేశ్ హైకోర్టు ఆదివారం తిరస్కరించింది.
చట్టోగ్రామ్లోని దిగువ కోర్టులో ఈ హత్య కేసుకు సంబంధించి సాక్షుల వాంగ్మూల నమోదు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ధర్మాసనం బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించిందని చిన్మయ్ దాస్ తరపు న్యాయవాది అపూర్బ కుమార్ భట్టాచార్య మీడియాకు వెల్లడించారు. అయితే, దాస్పై నమోదైన ఇతర నాలుగు కేసుల బెయిల్ పిటిషన్లపై జస్టిస్ కె.ఎం. జాహిద్ సర్వార్, జస్టిస్ షేక్ అబు తాహెర్లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరపనుంది. 2024 నవంబర్ 25న దేశద్రోహం ఆరోపణలపై చిన్మయ్ దాస్ను ఢాకా విమానాశ్రయంలో అరెస్టు చేశారు.
