హైదరాబాద్, వెలుగు: ప్రొటోకాల్ కమిటీపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం ఏఐసీసీ కార్యదర్శులు, మాజీ మంత్రులతో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ సమావేశమయ్యారు. ఈ మీటింగ్కు హాజరయ్యేవాళ్ల లిస్టులో చిన్నారెడ్డి పేరు లేదు. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. తనపై కావాలనే కుట్ర చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం.
విషయం తెలుసుకున్న ప్రొటోకాల్ కమిటీ.. చిన్నారెడ్డిని మురళీధరన్వద్దకు తీసుకెళ్లింది. లిస్టులో చిన్నారెడ్డి పేరు పొరపాటున మిస్సయిందని గాంధీభవన్ వర్గాలు చెప్పాయి. ఇదిలాఉంటే, రెండు రోజుల క్రితమే చిన్నారెడ్డిపై వనపర్తి జిల్లా నేతలు ఏఐసీసీ నేతలకు ఫిర్యాదు చేశారు. ఆయనకు ఎట్టిపరిస్థితుల్లో టికెట్ ఇవ్వొద్దని, ఇస్తే సహకరించేది లేదని తేల్చిచెప్పారు.