
- తీవ్రంగా నష్టపోతున్న కస్టమర్లు
- నెలల తరబడి తిరిగినా చెల్లింపుల్లో జాప్యం
- కంపెనీల పేరుతో మేనేజర్ల చేతివాటం
- నిబంధనలకు తిలోదకాలు
- పట్టించుకోని అధికార యంత్రాంగం
- తాజాగా ఓ చిట్ ఫండ్ ఉద్యోగి సూసైడ్
భద్రాచలం, వెలుగు : భద్రాచలం మన్యంలో చిట్ఫండ్స్ కంపెనీల ఆగడాలు శృతిమించుతున్నాయి. ఆపదకాలంలో ఆర్థికంగా ఆదుకుంటాయనే నమ్మకంతో చిట్ఫండ్ కంపెనీల్లో సభ్యులుగా చేరిన కస్టమర్లు వారి మోసాలకు బలి అవుతున్నారు. ఏజెన్సీలో ఇటీవల భారీగా వెలిసిన చిట్ఫండ్స్ కంపెనీలు మోసాలకు చిరునామాలుగా మారాయి. అనధికార చిట్టీలు కట్టి మోసపోయే కంటే రిజిస్టర్డ్ చిట్ఫండ్స్ కంపెనీల్లో చిట్టీలు వేసుకుని నాలుగు డబ్బులు వెనకేసుకుందామనుకున్న వారిని నిలువునా ముంచుతున్నాయి.
చిట్టీలు వేసిన వారికి సకాలంలో డబ్బులు చెల్లించడం లేదు. బ్రాంచ్ల పేరుతో ఆఫీసులు తెరిచి లోకల్లోని కొందరు యువకులను ఎంప్లాయీస్గా చేర్చుకుంటున్నారు. వారికి టార్గెట్లు ఇచ్చి కస్టమర్లను చేర్పిస్తున్నారు. పెద్ద మొత్తంలో చిట్టీలు వచ్చాక బోర్డు తిప్పేస్తున్నారు. దీంతో కస్టమర్లతో పాటు అందులో ఎంప్లాయీస్గా చేరిన యువకుల జీవితాలు సర్వనాశనం అవుతున్నాయి. తాజాగా భద్రాచలంలో ఓ చిట్ఫండ్స్ కంపెనీలో పనిచేసే ఉద్యోగి సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది.
సర్వీసు సెంటర్ల పేరుతో రంగప్రవేశం!
కొన్ని చిట్ఫండ్స్కంపెనీలు ఏజెన్సీలో సర్వీసు సెంటర్ల పేరుతో రంగప్రవేశం చేస్తున్నాయి. గిరిజన చట్టాల ప్రకారం ఏజెన్సీలో చిట్ఫండ్స్ వ్యాపారానికి పర్మిషన్లు ఇవ్వరు. దీంతో ఆయా కంపెనీలు కస్టమర్లకు సర్వీసు అందించే సెంటర్ల పేరుతో అక్రమంగా చిట్టీ వ్యాపారం చేస్తున్నారు. మైదాన ప్రాంతంలో రిజిస్ట్రేషన్ చేయించి, ఆ పేరుతో ఇక్కడ కట్టించుకుంటున్నారు. పాటపాడిన తర్వాత వారికి చెల్లింపులకు చుక్కలు చూపిస్తున్నారు.
కస్టమర్లు ఆఫీసుల వద్ద ఆందోళనలు చేపడుతున్న సంఘటనలు నిత్యకృత్యంగా మారాయి. ఆఫీసులకు తాళాలు వేయడం, ఘర్షణలకు దిగడం, పోలీస్ స్టేషన్లను ఆశ్రయించడం జరుగుతోంది. ఇదే తరహాలో భద్రాచలం పట్టణంలో కస్టమర్లతో చిట్టీలు కట్టించుకుని ఇటీవల రెండు కంపెనీలు అర్ధరాత్రి బోర్డు తిప్పేసి వెళ్లిపోయాయి. ఆయా మేనేజర్లకు కస్టమర్లు ఫోన్ చేస్తే మొఖం చాటేయడమే కాకుండా మిమ్మల్ని చేర్పించిన వారిని అడుక్కోండంటూ సమాధానం ఇస్తున్నారు. దీంతో జీతం వస్తుందనే ఆశతో ఆయా కంపెనీల్లో చేరి కస్టమర్లను చేర్పించిన యువకులు బలిపశువులు అవుతున్నారు.
కొన్ని ఘటనలు పరిశీలిస్తే..
- భద్రాచలం పట్టణంలో ఓ ప్రభుత్వ ఉద్యోగి తన పిల్లల పెళ్లికి ఉపయోగపడతాయని చిట్ఫండ్స్ కంపెనీలో డబ్బులు కట్టారు. కానీ తీరా పాడుకున్నా ఇవ్వకపోవడంతో ఆయన తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పోలీసులను ఆశ్రయించారు.
- కూనవరం రోడ్డులోని ఓ చిట్ఫండ్స్ కంపెనీలో కొత్తగూడెంకు చెందిన గిరిజన ఉద్యోగులు చిట్టీ వేశారు. వారికి మొండిచేయి చూపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- కొత్తగూడెం జిల్లా కేంద్రంలో అయితే తాము పాడుకున్న చిట్టీ డబ్బులు అడిగితే కస్టమర్లపై దాడి చేశారు.
పోలీసులు చర్యలు తీసుకోవాలి
ఏజెన్సీ ప్రజలను మోసం చేసే ప్రైవేటు చిట్ఫండ్ కంపెనీలపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. ఇటీవల రెండు కంపెనీలు తమ ఆఫీసులను అర్ధరాత్రి బోర్డు తిప్పేసి తరలించుకుపోయాయి. ఆ కంపెనీల్లో చేర్పించిన ఎంప్లాయీస్ ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక దోపిడీలకు పాల్పడే ఇలాంటి కంపెనీలను ఏజెన్సీ నుంచి తరిమేయాలి.
దన్నాన తరుణ్కుమార్, అడ్వొకేట్