
భద్రాచలం, వెలుగు: ఉన్నట్టుండి ఓ చిట్ఫండ్ కంపెనీ బోర్డు తిప్పేయడంతో అందులో పనిచేసే ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భద్రాద్రికొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జరిగింది. టౌన్లోని రిక్షా కాలనీకి చెందిన శ్రీనివాస్ కనకదుర్గా చిట్ఫండ్ కంపెనీలో ఎంప్లాయ్గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఈ చిట్ఫండ్ కంపెనీ ఆఫీసును అర్ధంతరంగా ఎత్తేశారు. బోర్డు తిప్పేయడంతో శ్రీనివాస్ చేర్పించిన ఖాతాదారులు డబ్బుల కోసం ఒత్తిడి తెస్తున్నారు.
శనివారం కొందరు ఖాతాదారులు బెదిరించడంతో ఆందోళన చెందిన శ్రీనివాస్.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. ‘కనకదుర్గా చిట్పండ్ కంపెనీలో నాలుగేళ్లుగా పనిచేస్తున్నా.. చాలా మంది కస్టమర్లను అందులో చేర్చా.. బ్రాంచ్ మేనేజర్ తప్పించుకు తిరుగుతుంటే కస్టమర్లు నాపై ఒత్తిడి తెస్తున్నారు.. ఇలాంటి చిట్ ఫండ్ కంపెనీల చేతిలో ఎవరూ మోసపోవద్దు..’ అంటూ సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.