
చిత్తూరు జిల్లాలో గ్యాంగ్ స్టర్స్ ( దొంగలు) హల్ చల్ చేశారు. కుప్పంలో హర్యానా.. రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన దోపిడి దొంగలు సంచరిస్తున్నారు. రైల్వే స్టేషన్ లో పోలీసులు జరిపిన తనిఖీల్లో గ్యాంగ్ స్టర్ ముఠా సభ్యుడిని పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
జూన్ 5 గురువావం ఉదయం పుష్ పుల్ ట్రైన్ లో బెంగళూరు వెళ్ళేందుకు ఓ దొంగల ముఠా సిద్దమైంది. ముందస్తు సమాచారం మేరకు రైల్వేస్టేషన్లో ప్రత్యేక బృందాలు తనిఖీ చేస్తున్నాయి.ఈ సమయంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ ఐదుగురిని పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకొనేందుకు ప్రయత్నించగా పారిపోయేందుకు ప్రయత్నించారు. గ్యాంగ్స్టర్స్ ముఠాలోని ఐదుగురు సభ్యుల్లో ఒకరు పోలీసుల చేతికి చిక్కాడు. మిగిలిన వారి కోసం ఆరా తీస్తున్నారు.
ప్రత్యేక బృందాలు రంగంలోకి దింపిన కుప్పం పోలీసులకు .. గ్యాంగ్ స్టర్ లకు మధ్య తంబిగాని పల్లి చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తుండగా కాల్పులు జరిగాయి. ఐదుగురు సభ్యులతో కూడిన గ్యాంగ్ స్టర్స్ ముఠాలో ఒకరికి బుల్లెట్ గాయాలయ్యాయి. డ్రోన్ కెమెరాలు, డాగ్ స్క్వాడ్ తో కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని బెవనపల్లి, చీలే పల్లి, పరమ సముద్రం ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
కుప్పం రెవెన్యూ డివిజన్ పరిధిలో తహశీల్దార్ లకు పోలీసులు ఎమర్జెన్సీ మెసేజ్ అందించారు. చుట్టు పక్కల గ్రామాల వీఆర్ఏ... వీఆర్వోలను అప్రమత్తం చేశారు. పోలీసుల కాల్పుల్లో గాయపడిన దొంగ హిందీలో మాట్లాడతాడని... తొడలో బుల్లెట్ గాయంతో చికిత్స పొందుతున్న వివరాలు తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.