హైదరాబాద్, వెలుగు : రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ నష్టాన్ని నివారించేందుకే ట్రాఫిక్ రూల్స్ కఠినంగా అమలు చేస్తున్నామని, కొత్త రూల్స్ కాదని సిటీ ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. రాంగ్ రూట్, ట్రిపుల్ రైడింగ్పై ఈ నెల 28 నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నట్లు తెలిపారు. చలాన్ల కోసమే ట్రాఫిక్ పోలీసులు కొత్త రూల్స్ పెడుతున్నారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై సోమవారం ఆయనవివరణ ఇచ్చారు. చలాన్లతో ఇబ్బంది పడుతున్న వాహనదారులకు గతంలో డిస్కౌంట్ కూడా ఇచ్చినట్లు గుర్తు చేశారు. వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్లో అమలు చేసే రూల్స్ కొత్తవి కావని, మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారమే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
రూల్స్ ఫాలో కావల్సిందే
రూల్స్ బ్రేక్ చేస్తున్న బైక్ లపై గతంలో కంటే తక్కువ చలాన్లు విధిస్తున్నట్లు రంగనాథ్ తెలిపారు. నంబర్ ప్లేట్ సరిగా లేని వాహనదారులపై చర్యలు తీసుకుంటామన్నారు. అందరూ రూల్స్ఫాలో అయ్యేందుకే స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే మూడు కమిషనరేట్ల ట్రాఫిక్ పోలీసులతో కో ఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు. కమిషనరేట్ల బోర్డర్స్, వీఐపీ మూవ్మెంట్స్, ఈ–చలాన్లు సహా ఇతర సమస్యలపై చర్చించారు. సమావేశంలో రాచకొండ ట్రాఫిక్ డీసీపీ డి.శ్రీనివాస్, సైబరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి సహా ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.