- హైదరాబాద్ను పొల్యూషన్ ఫ్రీ సిటీగా మారుస్తం
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీలో త్వరలో అన్ని ఎలక్ట్రిక్ బస్సులనే వినియోగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడు నగరంలో తిరుగుతున్న డీజిల్ బస్సులను జిల్లాలకు తరలిస్తామని చెప్పారు. మంగళవారం తన ఇంట్లో సీఎం రేవంత్ మీడియాతో చిట్ చాట్ చేశారు. హైదరాబాద్ మహానగరాన్ని పొల్యూషన్ ఫ్రీ సిటీగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
రూ. లక్షన్నర కోట్లతో మూసీ రివర్ ప్రక్షాళన ఏమిటని ఎక్స్ వేదికగా కేటీఆర్ అడిగిన ప్రశ్నపై రేవంత్ స్పందించారు. ‘‘కేటీఆర్ ఓ పిచ్చోడు.. పదేండ్లు మంత్రిగా వెలగబెట్టానని గొప్పగా చెప్తాడు.. కానీ అమెరికాలో బాత్ రూం లు కడిగిన తెలివి తప్ప మరేమి లేదు” అని మండిపడ్డారు. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ చీఫ్ నియామకానికి సంబంధించిన నిర్ణయాలు హైకమాండ్ చేతిలో ఉన్నాయని చెప్పారు.
హైదరాబాద్ను ప్రణాళికాబద్ధంగా డెవలప్ చేస్తం
హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని సీఎం రేవంత్ చెప్పారు. కేంద్ర బడ్జెట్ లో దక్షిణాది ప్రాంతాలకు జరిగిన అన్యాయంపై త్వరలో అన్ని రాష్ట్రాల సీఎంల సమావేశాలు ఉండే అవకాశం ఉన్నదని చెప్పారు. రాహుల్ ప్రతిపక్ష నేతగా ఉన్నందున దీనిపై పార్లమెంట్ లో ప్రస్తావించే చాన్స్ ఉంటుందన్నారు.
