సిడ్నీ చేరుకున్న ఇండియా క్రికెటర్లు, స్టాఫ్ అందరికీ కరోనా నెగెటివ్
టీమ్తో కలవనున్న ‘ఐసోలేషన్ ప్లేయర్లు’
షెడ్యూల్ ప్రకారమే బ్రిస్బేన్ టెస్టు!
వేదిక మార్చమని బీసీసీఐ రిక్వెస్ట్ చేయలేదన్న సీఏ
రోహిత్ శర్మ సహా ఐదుగురు ప్లేయర్లు బయో బబుల్ ప్రొటోకాల్స్ బ్రేక్ చేశారన్న ఆరోపణలు, బ్రిస్బేన్ టెస్టును బీసీసీఐ బాయ్కాట్ చేయాలనుకుంటుందన్న వార్తలతో ఇండియా–ఆస్ట్రేలియా సిరీస్ మధ్యలో వేడెక్కిన వాతావరణం కాస్త చల్లబడింది. ఈ టెస్టు సిరీస్ పూర్తిగా జరగడంపై వస్తున్న అనుమానాలు నెమ్మదిగా తొలగిపోతున్నాయి. లాస్ట్ టెస్టును బ్రిస్బేన్ నుంచి ఇంకో ప్లేస్కు మార్చాలని బీసీసీఐ నుంచి తమకు ఎలాంటి రిక్వెస్ట్ రాలేదని క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టం చేసింది. బాయ్కాట్ విషయంలో ఇండియన్ బోర్డు నుంచి కూడా అఫీషియల్గా ఎలాంటి ప్రకటనా రాలేదు. ఇంకోవైపు మెల్బోర్న్ నుంచి థర్డ్ టెస్టు జరిగే సిడ్నీకి చేరుకున్న టీమిండియా ప్లేయర్లందరూ కరోనా టెస్టుల్లో నెగెటివ్గా తేలారు. ఇప్పటికైతే గురువారం మొదలయ్యే థర్డ్ టెస్టుకు లైన్ క్లియర్ అవగా.. చివరి టెస్టు కూడా షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని రెండు దేశాల బోర్డులూ నమ్మకంగా ఉన్నాయి.
మెల్బోర్న్/సిడ్నీ: ఆటేతర విషయాలతో ఇండియా–ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ మధ్యలో రేగిన వివాదాలు నెమ్మదిగా సద్దుమనుగుతున్నాయి. ఈ నెల ఏడో తేదీ నుంచి జరిగే మూడో టెస్టు కోసం సోమవారం సిడ్నీ చేరుకున్న ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్ కరోనా టెస్టుల్లో క్లియర్ అయ్యారు. ఆదివారం చేసిన ఆర్టీ–పీసీఆర్ టెస్టుల్లో అందరికీ నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందని బీసీసీఐ ప్రకటించింది. దాంతో, సిడ్నీ టెస్టుకు లైన్ క్లియర్ అవగా.. ఐసోలేషన్లో ఉన్న వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, నవదీప్ సైనీ, పృథ్వీ షా కూడా టీమ్తో కలవనున్నారు. ఓ ఇండోర్ రెస్టారెంట్కు వెళ్లిన కారణంగా క్రికెట్ ఆస్ట్రేలియా వీళ్లందరినీ ఐసోలేషన్లో ఉంచిన సంగతి తెలిసిందే. ఈ ఐదుగురూ బయో సెక్యూరిటీ ప్రొటోకాల్స్ బ్రేక్ చేశారో లేదో బీసీసీఐతో కలిసి జాయింట్ ఇన్వెస్టిగేట్ చేస్తామని సీఏ ప్రకటించింది. కానీ, దీనిపై రెండు దేశాల బోర్డుల నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. దాంతో, ఈ ఐదుగురు ప్లేయర్లు సిడ్నీ టెస్టులో ఆడేందుకు క్లియరెన్స్ లభించినట్టే అని ఇండియా టీమ్ వర్గాలు చెబుతున్నాయి. ఐసోలేషన్లో ఉంచినప్పటికీ రోహిత్ అండ్ కోను ఇండియా టీమ్తో కలిసి ట్రావెలింగ్, ట్రెయినింగ్కు సీఏ ఇప్పటికే అనుమతిచ్చింది. ఇప్పుడు కరోనా టెస్టుల్లో అందరూ నెగెటివ్గా తేలడంతో బీసీసీఐకి ఊరట లభించింది. దాంతో, ప్రొటోకాల్ బ్రేక్పై రేగిన వివాదానికి పుల్స్టాప్ పడినట్టే అనిపిస్తోంది. అయితే, న్యూ సౌత్ వేల్స్లో కొత్తగా 8 మందికి కరోనా సోకినట్టు తేలడంతో ఆ స్టేట్లో మరిన్ని రూల్స్ పెట్టారు. సోషల్ డిస్టెన్సింగ్ను మళ్లీ అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిడ్నీలో ఉన్నన్ని రోజులు పాటించాల్సిన ప్రొటోకాల్స్ను లోకల్ గవర్నమెంట్ బీసీసీఐకి తెలిజేసింది. వీటికి ఒప్పుకున్న టీమ్ మేనేజ్మెంట్ ట్రెయినింగ్ కోసం తప్ప టీమ్ హోటల్ దాటి బయటికి ప్లేయర్లను వెళ్లొద్దని ఆదేశించింది. సోషల్ డిస్టెన్స్ కూడా మెయింటేన్ చేయాలని చెప్పింది.
క్వారంటైన్కు బీసీసీఐ సపోర్ట్గా ఉంది: హాక్లే
స్ట్రిక్ట్ క్వారంటైన్ రూల్స్ పాటించాల్సి ఉండడంతో ఈ నెల 15 నుంచి బ్రిస్బేన్ (క్వీన్స్లాండ్)లో జరిగే నాలుగో టెస్టు ఆడేందుకు ఇండియా టీమ్ ఇష్టపడడం లేదని వచ్చిన వార్తలను క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిక్ హాక్లే కొట్టి పారేశారు. ఈ మ్యాచ్ను ఇంకో ప్లేస్కు షిఫ్ట్ చేయాలని బీసీసీఐ నుంచి తమకు ఎలాంటి రిక్వెస్ట్ రాలేదని స్పష్టం చేశారు. క్వీన్స్లాండ్లో క్వారంటైన్ అవసరాలకు ఇండియన్ క్రికెట్ బోర్డు తమకు ఫుల్ సపోర్ట్గా ఉందని చెప్పారు. ‘బీసీసీఐ అఫీషియల్స్తో మేం ప్రతి రోజూ మాట్లాడుతున్నాం. బ్రిస్బేన్ టెస్టు విషయంలో వారి నుంచి మాకు ఎలాంటి రిక్వెస్ట్ రాలేదు. వాళ్లు మాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. రెండు జట్లు కూడా మేం సెట్ చేసిన షెడ్యూల్ ప్రకారమే ఆడాలని కోరుకుంటున్నాయి’ అని హాక్లే పేర్కొన్నారు.
‘ఫ్యాన్స్కు లేని సమస్య ప్లేయర్లకు ఎందుకు’
ఫోర్త్ టెస్టు గురించి బీసీసీఐ నుంచి అఫీషియల్గా ఎలాంటి ప్రకటన రాకపోయినప్పటికీ కొందరు అధికారులు మాత్రం క్వీన్స్లాండ్ స్టేట్ గవర్నమెంట్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేడియాలకు ఫ్యాన్స్ వస్తున్నప్పుడు లేని సమస్య.. తమ ప్లేయర్లకు ఎందుకని ప్రశ్నించారు. మళ్లీ స్ట్రిక్ట్ క్వారంటైన్లో ఉండటానికి తమ ప్లేయర్లు జూలో జంతువులు కాదని ఓ అధికారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. విషయం పెద్దదిగా మారడంతో సీఏ స్పందించాల్సి వచ్చింది. అయితే, బీసీసీఐ నుంచి తమకు ఎలాంటి రిక్వెస్ట్ రాలేదని సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హాక్లే వివరణ ఇచ్చినప్పటికీ బ్రిస్బేన్లో క్వారంటైన్ రూల్స్ నుంచి టీమిండియాకు ఎగ్జెంప్షన్ ఇస్తారో లేదో చెప్పలేదు. ఇప్పటికైతే బ్రిస్బేన్లో అరేంజ్మెంట్స్పై సీఏతో బీసీసీఐ టచ్లో ఉన్నట్టు తెలుస్తోంది. స్ట్రిక్ట్ క్వారంటైన్ విషయంలో ప్లేయర్లకు కొన్ని మినహాయింపులు ఇచ్చే విషయంలో చర్చలు జరుగుపుతున్నట్టు సమాచారం. దీనిపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
సిడ్నీ టెస్టుకు 25 శాతం మందే
సిడ్నీ టెస్టుకు స్టేడియం సీటింగ్ కెపాసిటీలో 25 శాతం ఫ్యాన్స్కే అనుమతి ఇస్తున్నట్టు సీఏ ప్రకటించింది. సిటీలో కొత్తగా వైరస్ కేసులు వెలుగు చూడడంతో న్యూ సౌత్వేల్స్ గవర్నమెంట్ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఎస్సీజీ స్టేడియం కెపాసిటీ 38 వేలు కాగా.. రోజుకు 9500 మందిని మాత్రమే అనుమతిస్తారు. ఇదే స్టేడియంలోఇండియా-ఆసీస్ మధ్య రెండు వన్డేలు, రెండు టీ20లు జరగ్గా.. తొలి మూడు మ్యాచ్లకు 18 వేల మంది ఫ్యాన్స్కు అవకాశం ఇచ్చారు. డిసెంబర్ 8న జరిగిన చివరి టీ20కి మాత్రం 30 వేల మందిని అనుమతించారు. అయితే, సోషల్ డిస్టెన్సింగ్ పాటించాల్సిన కారణంగా థర్డ్ టెస్టు సీటింగ్ కెపాసిటీని తగ్గిస్తున్నట్టు హాక్లే చెప్పారు. ఇప్పటికే టికెట్లు కొన్నవారికి రీఫండ్ చేస్తామన్నారు. సోషల్ డిస్టెన్సింగ్ కు తగ్గట్టు సీటింగ్లో మార్పులు చేసి మంగళవారం నుంచి టికెట్ల రీసేల్ స్టార్ట్ చేస్తామన్నారు.
For More News..
కేటీఆర్ ఇలాఖాలో వర్క్ ప్రోగ్రెస్ పూర్
రూ.1,300 కోట్ల రుణమాఫీకి ఇచ్చింది 20 కోట్లే
డిసెంబర్ వాటర్ బిల్లొచ్చింది.. ఫ్రీ వాటర్ స్కీమ్ ఉన్నట్టా..లేనట్టా?

