
- మనస్తాపంతో పురుగుల మందు తాగి.. చికిత్స పొందుతూ మృతి
కాగజ్ నగర్ వెలుగు: ఓనర్ తిట్టాడని మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించిన గుమస్తా చికిత్సపొందుతూ మృతిచెందిన ఘటన కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో జరిగింది. గ్రామస్తులు, కుటుంబసభ్యులు తెలిపిన ప్రకారం.. పెంచికల్ పేట్ మండలం అగర్ గూడ గ్రామానికి చెందిన తుమిడే రాజశేఖర్(22), తండ్రి చనిపోగా తల్లి ఉంది. అతడు మండల కేంద్రంలోని రాచకొండ కృష్ణ ఫెర్టిలైజర్ షాప్ లో గుమస్తాగా చేస్తున్నాడు. ఇటీవల తన అవసరాలకు ఓనర్ లేనప్పుడు అతని కుటుంబీకులకు చెప్పి రూ.10 వేలు అప్పు తీసుకున్నాడు. రాజశేఖర్ కొద్దిరోజులు షాప్ కు వెళ్లలేదు. మళ్లీ షాప్ కు వెళ్తుండగా.. సోమవారం డబ్బుల విషయమై ఓనర్ కృష్ణ అడగడంతో తిరిగి ఇచ్చాడు.
కాగా.. పనికి సరిగా రాకుండా డబ్బులు తీసుకుంటే ఎలా అంటూ పలువురి ముందు గుమస్తాపై ఓనర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో మనస్తాపం చెందిన రాజశేఖర్ షాపులోంచి బయటకు వెళ్లి.. సాయంత్రం 4 గంటల సమయంలో అగర్ గూడ వెళ్లే దారిలో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నించి కనిపించాడు. స్థానికులు చూసి వెంటనే ఆస్పత్రికి తరలించగా కండీషన్ సీరియస్ గా ఉండడంతో కరీంనగర్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్ చేయగా చికిత్సపొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందాడు.
కాగా.. ఉదయం బాధిత కుటుంబీకులు, గ్రామస్తులు ఫెర్టిలైజర్ షాప్ ఓనర్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. రాజశేఖర్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి రూరల్ సీఐ శ్రీనివాస్ సిబ్బందితో వెళ్లి బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజశేఖర్ తల్లి లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ కొమురయ్య తెలిపారు.