- కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమణ
జన్నారం, వెలుగు: ఎన్నికల సందర్భంగా గీత కార్మికులకు ఇచ్చిన హమీలను అమలు చేయాలని తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల రమణ డిమాండ్ చేశారు. గీతన్నల చైతన్య యాత్రలో భాగంగా శనివారం మంచిర్యాల జిల్లా జన్నారంలోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
50 ఏండ్లు పైబడిన గీత కార్మికుల పెన్షన్ను రూ.4 వేలకు పెంచాలని, వృత్తిలో ప్రమాదానికి గురైతే రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని కోరారు. నీరాకు రాష్ట్ర బడ్జెట్ లో కేటాయించిన రూ.25 కోట్లు, గీత కార్మికుల సంక్షేమానికి కేటాయించిన రూ.67 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ నెల 18న సర్దార్ సర్యాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ పై విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు. తాటికొండ ఫిలాసాపురం కోటలను ప్రభుత్వం పర్యాటక ప్రాంతంగా డెవలప్ చేయాలని కోరారు. అంతకుముందు బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, నేతలు జయరాం, కాసారపు లచ్చా గౌడ్, బాలసాని శ్రీనివాస్ గౌడ్, మూల భాస్కర్ గౌడ్, పొడెటి రవి గౌడ్ పాల్గొన్నారు.
