వరంగల్/ ఖిలా వరంగల్, వెలుగు: మామునూర్ ఎయిర్పోర్టు, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, ఇన్నర్ రింగ్రోడ్, జాతీయ రహదారులతో వరంగల్ జిల్లా అభివృద్ధి పరుగులు పెడుతోందని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.
గీసుగొండ మండలంలో 1,357 ఎకరాల్లో నిర్మించిన మెగా టెక్స్టైల్ పార్క్ ద్వారా యువత, మహిళలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. మామునూర్ ఎయిర్పోర్టుతో జిల్లా రూపురేఖలు మారనున్నాయని తెలిపారు. భూములు ఇచ్చిన 330 మంది రైతులకు రూ.258 కోట్ల పరిహారం చెల్లించామన్నారు.
వరంగల్ చుట్టూ రూ.319 కోట్లతో 200 అడుగుల ఇన్నర్ రింగ్రోడ్ అభివృద్ధి జరుగుతోందని, జాతీయ రహదారి 163(జీ) పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. రూ.80 కోట్లతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు. జిల్లాలో 25.51 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే 11.50 లక్షల మొక్కలు నాటినట్లు పేర్కొన్నారు. అనంతరం లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు.
