
కొండల మీద నుంచి దూకే జలపాతాల అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ఫొటోలో కనిపిస్తున్నది మాత్రం జలపాతం కానేకాదు. కొండకోనల మధ్య నుంచి దూకిన మేఘాల జడి. మిజోరాంలోని ఐజ్వాల్లో కనిపించిందీ ప్రకృతి చిత్రం. అజీజ్ బార్భుయ్యా అనే వ్యక్తి ఫేస్బుక్లో ఈ మేఘాల వరద వీడియోను పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. దీనినే ఓరోగ్రాఫిక్ క్లౌడ్స్ అని పిలుస్తున్నారు నిపుణులు. మామూలుగా చెప్పుకోవాలంటే వాటర్ఫాల్ క్లౌడ్స్ అంటున్నారు. కొండ ప్రాంతాల్లోని తేమతో కలిసి ఈ మబ్బులు ఇలా కిందకు ప్రయాణిస్తాయని చెబుతున్నారు. స్థిరమైన గాలి కొండలను తాకినప్పుడు, మబ్బులు పైకి లేస్తాయని, అలా వెళుతున్న క్రమంలోనే అది చల్లబడుతుందని వివరిస్తున్నారు. గాలిలోని నీటి బిందువులు మబ్బులతో కలిసి మేఘాల్లా మారి పల్లం వైపు వెళతాయని అంటున్నారు. ఇప్పుడు ఐజ్వాల్లో జరిగింది అదేనంటున్నారు. 2017లో చైనాలోని మౌంట్లూలోనూ ఇలాగే జరిగింది.