
ముషీరాబాద్, వెలుగు: టీవీ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో నిందితుడు పూర్ణచందర్పై పోక్సో కేసు నమోదైంది. స్వేచ్ఛ కూతురు ఫిర్యాదుతో చిక్కడపల్లి పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. శుక్రవారం స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి పరారీలో ఉన్న పూర్ణచందర్ శనివారం అర్ధరాత్రి పోలీసుల ముందు లొంగిపోయాడు. అంతకుముందే.. స్వేచ్ఛ మరణంతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ఓ లేఖను విడుదల చేశాడు. ఈ క్రమంలో స్వేచ్ఛ కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పూర్ణచందర్ లేఖలో రాసినవన్నీ అబద్ధాలేనని, తనతో అసభ్యంగా ప్రవర్తించేవాడని, అమ్మతో ఎప్పుడూ కలవనిచ్చేవాడు కాదని అందులో పేర్కొంది. పెండ్లి పేరిట తన తల్లి స్వేచ్ఛను నమ్మించి మోసం చేశాడని, ఆమెను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడని తెలిపింది. పూర్ణచందర్ ను అరెస్టు చేసినట్లు చిక్కడపల్లి ఏసీపీ రమేశ్ కుమార్ తెలిపారు. ప్రతిసారి పెండ్లి మాట దాటవేయడం వల్లనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. పూర్ణచందర్పై బీఎన్ఎస్ యాక్ట్ 69,108తో పాటు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి నాంపల్లిలో జడ్జి ముందు ప్రవేశపెట్టగా.. జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు.
ఎంతో మంది అమ్మాయిలను వేధించిండు: స్వేచ్ఛ తండ్రి
పూర్ణచందర్ వేధింపుల వల్లనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని స్వేచ్ఛ తండ్రి శంకర్ మీడియాతో అన్నారు. ‘‘నా కూతుర్ని పెండ్లి చేసుకుంటానని వెంటపడ్డాడు. చివరికి పెండ్లికి నా కూతురు అంగీకరించిన తర్వాత.. ఇద్దరు మధ్య చాలాసార్లు గొడవలు జరిగాయి” అని పేర్కొన్నారు. గతంలో ఎంతోమంది అమ్మాయిలను పూర్ణచందర్ వేధించాడని ఆరోపించారు. పూర్ణచందర్ భవిష్యత్తులో మరే అమ్మాయి జీవితం నాశనం చేయకుండా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ‘‘తమ మధ్య గొడవలు జరుగుతున్నాయని స్వేచ్ఛ కాల్ చేసి చెప్పినప్పుడు పూర్ణచందర్ తో మాట్లాడాం. పూర్ణచందర్ కుటుంబంలో స్వేచ్ఛ అందరికీ తెలుసు. ఆయన తండ్రి చాలాసార్లు స్వేచ్ఛ ఇంటికి వచ్చేవాడు. మీ కుటుంబంలో సభ్యురాలిగా తనను ఎందుకు గుర్తించడం లేదని పూర్ణచందర్ ను ప్రశ్నించిన స్వేచ్ఛ.. ఆ కుటుంబంలో స్థానం ఇవ్వలేదని డిప్రెషన్లోకి వెళ్లింది. భార్య స్థానం ఇచ్చినట్లుగా పూర్ణచందర్ కేసును తప్పుదారి పట్టిస్తున్నడు” అని స్వేచ్ఛ మేనమామ నరసయ్య, అత్త సుశీల తెలిపారు.
కీలకంగా మారిన స్వేచ్ఛ ఫోన్
స్వేచ్ఛ సూసైడ్ కేసులో ఆమె మొబైల్ ఫోన్ కీలకంగా మారింది. ఫోన్ను రికవరీ చేసిన పోలీసులు.. స్వేచ్ఛ లాస్ట్ కాల్ ఎవరితో మాట్లాడింది..? స్వేచ్ఛ, పూర్ణ చందర్ మధ్య జరిగిన గొడవ ఏమిటి? అనే కోణాల్లో విచారణ జరుపుతున్నారు.