కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో పెను ప్రమాదం తప్పింది. పోరండ్ల గ్రామ సమీపంలో గ్రానైట్ లోడుతో వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పడంతో.. భారీ గ్రానైట్ బండ రోడ్డుపై పడిపోయింది. ఏపీ 15 టీసీ 7656 నంబర్ గల లారీ.. మల్లాపూర్ గ్రానైట్ క్వారీ నుండి కరీంనగర్ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో రోడ్డుపై వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెను ముప్పు తప్పింది. లేదంటే భారీ ప్రాణనష్టం జరిగి ఉండేదని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
అయితే ఆ భారీ బండ కింద పడటంతో తారు రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. నిత్యం గ్రానైట్ లారీల రాకపోకలతో దుమ్ము, ధూళి సమస్యలను ఎదుర్కొంటున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా లారీలు ఓవర్లోడ్తో వెళ్లడం వల్లే రోడ్లు దెబ్బతింటున్నాయని, ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు.సంబంధిత అధికారులు స్పందించి, అతివేగంగా ఓవర్లోడ్తో వెళ్లే గ్రానైట్ లారీలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
