బీఆర్​ఎస్​ను ప్రజలు ఉతికి ఆరేస్తరు : భట్టి విక్రమార్క

బీఆర్​ఎస్​ను ప్రజలు ఉతికి ఆరేస్తరు : భట్టి విక్రమార్క
  • ఇందిరమ్మ రాజ్యం కోసం ఎదురుచూస్తున్నరు : భట్టి
  • రాష్ట్ర సంపదను బీఆర్​ఎస్​ లీడర్లు దోచుకున్నరు
  • మళ్లీ జనాన్ని మోసం చేసేందుకు కేసీఆర్​ వస్తున్నడు
  • కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నది దోపిడీదారుల కోసం కాదు
  • కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనే 6  గ్యారంటీలు అమలు చేస్తామని ప్రకటన

ఖమ్మం, వెలుగు : రాష్ట్ర ప్రజలకు బీఆర్​ఎస్​ దోపిడీ అర్థమైందని, ఆ పార్టీ మీద పెద్ద ఎత్తున  తిరుగుబాటు చేసేందుకు సిద్ధమయ్యారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ‘‘బీఆర్​ఎస్​ను ప్రజలు ఈ ఎన్నికల్లో ఉతికి ఆరేస్తరు. పదేండ్లలో రాష్ట్ర సంపదను దోచుకున్న బీఆర్ఎస్​ లీడర్లను, ప్రభుత్వ పెద్దలను తరిమికొడ్తరు. దోపిడీ ప్రభుత్వాన్ని వదిలించుకుని, ప్రజా ప్రభుత్వాన్ని, ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకోవాలని ఓటర్లు ఎదురుచూస్తున్నరు” అని ఆయన పేర్కొన్నారు. దళితులకు మూడెకరాలు,  ఇంటికో ఉద్యోగం ఇస్తానని కేసీఆర్​ చెప్పి మోసగించారని, మళ్లీ ఇలాంటి హామీలిచ్చి మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారని మండిపడ్డారు. ‘‘కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నది దొరల కోసమో..  దోపిడీదారుల కోసమో కాదు.

ప్రజల బాగు కోసం” అని అన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని అనంతసాగర్​లో భట్టి విక్రమార్క బుధవారం మీడియాతో మాట్లాడారు. అంతకు ముందు బూత్ లెవల్​ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత  స్టేట్​లో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు గానీ,  ఒక్క ఇండస్ట్రీ గానీ రాలేదని, రాష్ట్రాన్ని కేసీఆర్​ రూ. 5 లక్షల కోట్ల అప్పులు చేశారని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్​ఎస్​ ఎక్స్​పైరీ అయిందని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని, రాష్ట్ర సంపదను ప్రజలకు పంచేందుకే ఈ గ్యారంటీలను ప్రకటించామని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పడిన ఫస్ట్​ డే నుంచే ప్రజలకు గ్యారంటీ కార్డులు ఇస్తామన్నారు. 

సరైన టైమ్​లో అభ్యర్థుల లిస్ట్​

బీజేపీకి బీఆర్ఎస్ బీ టీంలాగా పనిచేస్తున్నదని, ఆ పార్టీలకు ఎంఐఎం వంత పాడుతున్నదని భట్టి విక్రమార్క ఆరోపించారు. ‘‘దేశ సంపదను కార్పొరేట్​సంస్థలకు బీజేపీ కట్టబెడుతుంటే.. రాష్ట్రంలో భూములను బీఆర్​ఎస్​ అమ్ముతున్నది. హైదరాబాద్ సిటీ చుట్టూ ఉన్న భూములన్నిటిని అప్పనంగా అమ్మేసుకుంటున్నరు. ప్రభుత్వ ఆస్తుల్ని, ఔటర్ రింగ్ రోడ్డును పనికిమాలిన సంస్థకు లీజుకు ఇచ్చేశారు” అని ఆయన దుయ్యబట్టారు. ‘‘సరైన టైమ్​లో కాంగ్రెస్​అభ్యర్థుల లిస్ట్​ ప్రకటిస్తం. బీఆర్​ఎస్​ లీడర్లు పార్టీ మారతారన్న భయంతోనే ముందుగా కేసీఆర్​అభ్యర్థులను ప్రకటించిండు” అని అన్నారు. కమ్యూనిస్టులతో పొత్తులపై జాతీయ స్థాయిలో నిర్ణయం జరుగుతుందని చెప్పారు. షర్మిల పార్టీ విలీనంపైనా హైకమాండ్​ చర్చిస్తుందని, ఆ స్థాయిలోనే నిర్ణయాలు ఉంటాయన్నారు.