సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఆగలేరా?..అమెరికాతో ట్రేడ్‌‌‌‌ డీల్‌‌‌‌పై భారత్‌‌‌‌ది ఏకపక్ష నిర్ణయమా?: ఖర్గే

సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఆగలేరా?..అమెరికాతో ట్రేడ్‌‌‌‌ డీల్‌‌‌‌పై భారత్‌‌‌‌ది ఏకపక్ష నిర్ణయమా?: ఖర్గే

న్యూఢిల్లీ: అమెరికాతో ఇండియా ట్రేడ్‌‌‌‌ డీల్‌‌‌‌పై కాంగ్రెస్‌‌‌‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అమెరికా టారిఫ్‌‌‌‌లపై ఆ దేశ సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు వేచిచూడకుండా ఎందుకు తొందరపడి ట్రాప్‌‌‌‌ డీల్‌‌‌‌లో చిక్కుకున్నారని శనివారం ‘ఎక్స్‌‌‌‌’లో ప్రశ్నించారు. దిక్కుతోచక ఈ డీల్‌‌‌‌కు ఓకే చెప్పారా.. లేక అమెరికాకు పూర్తిగా లొంగిపోయారా అని నిలదీశారు.

అమెరికాతో ఒప్పందం వల్ల ఆ దేశం నుంచి వచ్చే అనేక వస్తువులపై జీరో టారిఫ్‌‌‌‌లు ఉంటాయని, ఇది భారత వ్యవసాయ రంగాన్ని అమెరికా వస్తువులతో ముంచెత్తడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, రష్యా చమురుపై ఆంక్షలు పెట్టిన ఈ ఒప్పందంతో మన దేశ ఇంధన భద్రతను దెబ్బతీస్తుందని ఖర్గే చెప్పారు.