- ప్రతిమ హాస్పిటల్ కోసమే కొత్త ప్లాన్
- మాజీ ఎంపీ పొన్నం ఫైర్
కరీంనగర్ టౌన్, వెలుగు: కొత్తపల్లి నుంచి వరంగల్ వెళ్లేందుకు కొత్తగా వేస్తున్న హైవే వంకర్లు తిరుగుతూ పలు గ్రామాలను కలిపేలా అలైన్ మెంట్ చేయడంపై కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. మంగళవారం స్థానిక డీసీసీ ఆఫీస్ లో మాట్లాడుతూ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్ స్వప్రయోజనం కోసమే ప్రతిమ మెడికల్ కాలేజీని కలిపేలా వంకలు తింపుతున్నారని ఆరోపించారు. జగిత్యాల నుంచి వరంగల్ వెళ్లే వారు చొప్పదండి రోడ్డులోని జూబ్లీనగర్ నుంచి గోదావరిఖని రోడ్డులోని ఇరుకుళ్ల మీదుగా, వరంగల్ రోడ్డులోని ఖాదర్ గూడెం..ఇలా ఊర్లు తిరుగుతూ పోవాలా అని ప్రశ్నించారు.
వినోద్కుమార్కు సంబంధించిన ప్రతిమ హాస్పిటల్ నగునూర్–జూబ్లీనగర్ దగ్గర ఉండడంతో దాన్ని కలిపేలా ప్లాన్ మార్చారన్నారు. జగిత్యాల, కొత్తపల్లి, కరీంనగర్, మానకొండూరు మీదుగా వెళ్తే సమయం మిగలడంతో పాటు దూరభారం కూడా తగ్గుతుందన్నారు. ప్రస్తుత ఎంపీ బండి సంజయ్దీనిపై స్పందించి ప్రజలకు ఉపయోగపడే అలైన్మెంట్ ఉండేలా చూడాలన్నారు. ఇప్పటి రోడ్డును రెండు వైపులా విస్తరించి ఫోర్లేన్ రోడ్డు వచ్చేలా కేంద్రాన్ని ఒప్పించాలన్నారు. నాయకులు వైద్యుల అంజన్ కుమార్, మెన్నేని రోహిత్ రావు, లక్ష్మీప్రసన్న రెడ్డి, పద్మాకర్ పాల్గొన్నారు.