
సాయంత్రం సమావేశం కానున్నారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. ఈ భేటీకి ఇద్దరు సీఎంలతో పాటు రెండు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు , అధికారులు హాజరవుతారు. హైదరాబాద్ కు చేరుకున్న AP సీఎం జగన్ మోహన్ రెడ్డి… సాయంత్రం సీఎం క్యాంప్ ఆఫీసుకు వెళ్తారు. సమావేశంలో గోదావరి జలాల తరలింపుపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. నీటి వనరుల వినియోగంపై గతంలో కూడా ఇద్దరు సీఎంలు చర్చించారు. ఆ తర్వాత జలాల తరలింపునకు సంబంధించి రెండు రాష్ట్రాల కమిటీలు ప్రభుత్వాలకు నివేదికలిచ్చాయి. దీంతో అధికారుల నివేదికలపై కూడా ఇవాళ్టి భేటీలో చర్చించే అవకాశం ఉంది.
నీటి తరలింపుతో పాటు విభజన అంశాలు… చర్చకు రానున్నట్లు సమాచారం. ఢిల్లీలోని ఏపీ భవన్ ఆస్తుల విభజన, విద్యుత్ బకాయిలు, ఫైనాన్స్ కార్పొరేషన్, ట్రైబల్ వర్శిటీ లాంటి అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక సింగరేణి సంస్థ నిధులతో ఏపీ భూభాగంలో ఏర్పాటు చేసిన ఆప్మెల్ సంస్థ.. తమదే అంటూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆప్మెల్ తెలంగాణకు చెందాల్సిన సంస్థ అంటూ రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది.
మరోవైపు పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ పెంచాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల విభజన కూడా ఇప్పటికీ చిక్కుముడిగానే ఉండటంతో…ఈ అంశాలపై భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే ఆసక్తి నెలకొంది.