ఫారెస్ట్ ఆఫీసర్ మృతి పట్ల కేసీఆర్ సంతాపం

ఫారెస్ట్ ఆఫీసర్ మృతి పట్ల కేసీఆర్ సంతాపం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తికోయల దాడిలో మరణించిన ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.  వారి కుటుంబానికి సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దోషులకు కఠినంగా శిక్షలు పడేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డిని సీఎం ఆదేశించారు. మరణించిన ఎఫ్ఆర్‭ఓ కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‭గ్రేషియాను ప్రకటించారు. దాడిలో మరణించిన శ్రీనివాసరావు డ్యూటీలో వుంటే ఏ విధంగా అయితే.. నిబంధనల ప్రకారం జీతభత్యాలు అందుతాయో.. అవే నిబంధనల ప్రకారం ఆయన కుటుంబానికి పూర్తి వేతనాన్ని అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. రిటైర్ మెంట్ వయస్సువరకు వారి కుటుంబ సభ్యులకు ఈ వేతనం అందచేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కారుణ్య నియామకం కింద కుటుంబసభ్యుల్లో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కేసీఆర్ ఆదేశించారు.

ఎఫ్ఆర్‭ఓ పార్థివ దేహానికి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్‭ను కేసీఆర్ ఆదేశించారు. అటవీశాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‭లు ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు అంత్యక్రియల్లో పాల్గొని సంబంధిత ఏర్పాట్లు చూసుకోవాలని చెప్పారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల పై దాడులను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని కేసీఆర్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు తాము అండగా ఉంటామని.. ఎలాంటి భయం లేకుండా తమ విధిని నిర్వర్తించాలని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు.