మహబూబాబాద్అర్బన్, వెలుగు : గుర్తు తెలియని వ్యక్తులు మాజీ సర్పంచ్ భర్తను హత్య చేశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో బుధవారం వెలుగు చూసింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సింగారం గ్రామానికి చెందిన పిట్టల యాకయ్య(57) మంగళవారం రాత్రి ఇంటి ముందు ఆవరణలో పడుకున్నాడు. బుధవారం ఉదయం ఉదయం కుటుంబ సభ్యులు లేచి చూసే సరికే రక్తపు మడుగులో చనిపోయి కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
అర్ధరాత్రి టైంలో గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలతో దాడి చేసి హత్య చేసినట్లు గుర్తించారు. పోలీసులు క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. కాగా, యాకయ్య భార్య యశోదపైనే అనుమానం ఉందని అతడి తండ్రి సోమయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తిరుపతిరావు చెప్పారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రూరల్సీఐ అంజలి, ఎస్సై రాజు ఆధ్వర్యంలో బందోబస్త్ నిర్వహించారు.
