జూలూరుపాడు/ ములకలపల్లి, వెలుగు : పాఠశాలల్లో ఆహార నాణ్యత, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్ సూచించారు. మంగళవారం జూలూరుపాడు కేజీబీవీ, జడ్పీ స్కూల్ ను ఆయన తనిఖీ చేసి, కంప్యూటర్ ల్యాబ్, తరగతి గదులు, రిజిస్టర్ను పరిశీలించారు. కిచెన్ షెడ్ను పరిశీలించి ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు.
విద్యార్థులకు అందిస్తున్న వంటలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వంటలు నాణ్యతతో ఉండాలని లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. తాగునీరు, పరిశుభ్రత, మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లపై ఉపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ములకలపల్లి మండలం జగన్నాథపురం రైతువేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సీఎం రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని వీసీ ద్వారా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ అంకిత్ హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన విత్తన మేళాలో భాగంగా రైతులకు విత్తనాలు అందించారు.
