అమరుల కుటుంబాలను సీఎం కేసీఆర్ పట్టించుకోలేదు : షర్మిల

అమరుల కుటుంబాలను సీఎం కేసీఆర్ పట్టించుకోలేదు : షర్మిల

తెలంగాణ అమరుల కుటుంబాలను సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి షర్మిల నివాళులర్పించారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో 1200మంది బలిదానం చేసుకుంటే కేవలం 500మందికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అరకొర సాయం చేసిందన్నారు. ఉద్యమకారులకు సీఎం కేసీఆర్ ద్రోహం చేశారని మండిపడ్డారు.

కల్వకుంట్ల కవిత ఓడిపోతే ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారన్న షర్మిల..శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఎన్నికల్లో ఓడిపోతుందని తెలిసి కూడా పోటీలో నిలబెట్టారని షర్మిల అన్నారు. ఓడిపోయాక శంకరమ్మకు ఎందుకు నామినేటెడ్ పోస్ట్ ఇవ్వలేదని ప్రశ్నించారు. మలిదశలో పోరాడిన అసలైన ఉద్యమకారులకు వైఎస్సార్టీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కొడుకు ల్యాండ్ బ్యాంక్, కూతురు లిక్కర్ బ్యాంక్, కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో దోచుకున్నారని ఆరోపించారు. 

మూడేళ్లలోనే కాళేశ్వరం మునిగిపోయిందని షర్మిల విమర్శించారు. 18లక్షల ఎకారాలకు నీరిస్తామని చెప్పి..కేవలం 57వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారని షర్మిల చెప్పారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని..తెలంగాణ ఖజానాను లూటీ చేశారని ఆరోపించారు. తెలంగాణ బిడ్డలకున్న అభద్రతాభావాన్ని తొలగించడానికి వైఎస్ ఎంతో కృషి చేశారన్నారు. వైఎస్ చనిపోయాక తెలంగాణ బిడ్డల్లో అభద్రతాభావం నెలకొందన్నారు. తెలంగాణ రైతుల కోసం ఆలోచించి..రైతులకు ఉచిత కరెంట్ మీద తొలి సంతకం పెట్టారని చెప్పారు.