సెక్రటేరియట్ కు అంబేద్కర్ పేరు పెట్టాలని కేసీఆర్ నిర్ణయం

సెక్రటేరియట్ కు అంబేద్కర్ పేరు పెట్టాలని కేసీఆర్ నిర్ణయం

హైదరాబాద్: నూతనంగా నిర్మిస్తున్న రాష్ట్ర  సచివాలయానికి  భారతరత్న డా. బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం ఆదేశాలు జారీచేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... రాష్ట్ర సెక్రటేరియట్ కు అంబేద్కర్ పేరు పెట్టడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వ కారణమన్నారు. తాము తీసుకున్న ఈ నిర్ణయం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సమాన గౌరవం, హక్కులు దక్కాలన్న అంబేద్కర్ స్ఫూర్తితో తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. 

రాష్ట్రంగా ఏర్పడిన అనతి కాలంలోనే  సామాజిక, రాజకీయ, ఆర్ధిక, సాంస్కృతిక రంగాల్లో అన్ని వర్గాలను సమున్నత స్థాయిలో నిలుపుతూ  రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తోందని సీఎం కేసీఆర్ చెప్పారు. అంబేద్కర్ ఎంతో ముందుచూపుతో రాజ్యాంగంలో ఆర్టికల్ 3ను పొందుపరచారని, దానివల్లే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని కొనియాడారు. ఫెడరల్ స్ఫూర్తిని అమలు చేయడం ద్వారా మాత్రమే అన్ని వర్గాలకు సమాన హక్కులు, అవకాశాలు దక్కుతాయని అంబేద్కర్ చెప్పారని గుర్తు చేశారు.  దేశ గౌరవాన్ని  మరింత ఇనుమడింప చేయడానికి కొత్తగా నిర్మిస్తున్న భారత పార్లమెంట్ భవనానికి కూడా అంబేద్కర్ పేరును పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ డిమాండ్ చేశారు.