
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టును ప్రారంభించారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. జలహోమం నిర్వహించిన తర్వాత… ఉదయం 11 గంటల 30 నిమిషాల సమయంలో ముఖ్యమంత్రి మేడిగడ్డ బ్యారేజీ ఒకటో నంబర్ గేటును ఎత్తి దిగువకు నీళ్లు వదిలారు.
సీఎం కేసీఆర్ తర్వాత… గవర్నర్ నరసింహన్ రెండో నంబర్ గేటును.. జగన్- ఫఢ్నవీస్ లు మూడు, నాలుగో నంబర్ గేట్లను స్విచ్ ఆన్ చేసి ఎత్తారు. రిబ్బన్ కటింగ్ చేశారు.
ఉదయం 9.30 గంటల సమయంలో ఏపీ సీఎం జగన్.. ఆ తర్వాత గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మేడిగడ్డకు చేరుకున్నారు. హోమంలో పాల్గొన్నారు.
మేడిగడ్డ నుంచి హెలికాప్టర్లలో కన్నెపల్లి పంపుహౌస్ కు చేరుకోనున్నారు ప్రముఖులు. సీఎం కేసీఆర్ ఆరో నంబర్ మోటారును స్విచ్ ఆన్ చేసి లాంఛనంగా కాళేశ్వరం ఎత్తిపోతలను ప్రారంభిస్తారు. ఈ మోటార్ను బుధవారమే ట్రయల్ రన్ చేసి అధికారులు పరీక్షించారు. గవర్నర్, ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులు, అతిథుల తరలింపునకు ప్రభుత్వం ఐదు హెలిక్యాప్టర్లను వినియోగిస్తోంది.