కొత్త రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ నుంచి బియ్యం పంపిణీ

కొత్త రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ నుంచి బియ్యం పంపిణీ
  • ఉమ్మడి జిల్లాలో 11,25,290 కార్డులు
  • సెప్టెంబర్​లో 20,434 టన్నుల బియ్యం
  • ఈనెల 20 నుంచి రేషన్​షాపులకు

యాదాద్రి, వెలుగు : సెప్టెంబర్​ నుంచి రేషన్ కార్డు లబ్ధిదారులకు మళ్లీ బియ్యం పంపిణీ చేయనున్నారు. కొత్తగా రేషన్​కార్డులు వచ్చిన వారికి కూడా బియ్యం అందజేయనున్నారు. ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులకు సంబంధించి సెంట్రల్​గవర్నమెంట్​ఇప్పటికే తన కోటా అలాట్ చేసింది. రాష్ర్ట ప్రభుత్వం కూడా త్వరలో కోటా అలాట్​చేయనుంది. 

వచ్చే నెల నుంచి బియ్యం..

ప్రకృతి వైపరీత్యాలను దృష్టిలో పెట్టుకొని జూన్​లోనే ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో జూలై, ఆగస్టు నెలల్లో బియ్యం ఇవ్వలేదు. తాజాగా వచ్చే నెల నుంచి బియ్యం పంపిణీ కానుంది. అయితే ఈసారి కొత్త రేషన్​ కార్డులతోపాటు పాత రేషన్​ కార్డుల్లో కొత్తగా మెంబర్లుగా యాడ్ అయిన వారికి కూడా బియ్యం పంపిణీ చేయనున్నారు. దీంతో ఈసారి గతంలో కంటే ఎక్కువగా బియ్యం అలాట్​మెంట్​చేయాల్సి ఉంది. 

ఫిబ్రవరి నుంచి కొత్త రేషన్​కార్డుల జారీ..

పదేండ్లు పవర్​లో ఉన్న బీఆర్ఎస్ సర్కారు.. కొత్త రేషన్​కార్డుల జారీ, మెంబర్స్​ను యాడ్ చేయలేదు. అన్ని స్కీమ్స్​కు రేషన్​కార్డు కచ్చితం కావడంతో అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రాగానే ముందుగా వీటిపైనే దృష్టి సారించింది. మీ సేవతోపాటు ప్రజా పాలనలో భాగంగా నిర్వహించిన గ్రామసభల్లో అప్లికేషన్లు స్వీకరించింది. ఉమ్మడి జిల్లాలో మీ సేవ ద్వారా 1,18,681అప్లికేషన్లు వచ్చాయి. ప్రజాపాలన గ్రామ సభల్లో 2,68,921 అప్లికేషన్లు వచ్చాయి.

వీటన్నింటినీ వడబోసిన రెవెన్యూ ఆఫీసర్లు లబ్ధిదారులను ఎంపిక చేశారు. జనవరి 2025 వరకు ఉమ్మడి జిల్లాలో 9,97,251 కార్డులు ఉన్నాయి. ఫిబ్రవరి 2025 నుంచి రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక నడుస్తోంది. మే 25 వరకు ప్రతినెలా కొంతమంది చొప్పున విడతల వారీగా ఉమ్మడి జిల్లాలో 31,979 కొత్త రేషన్​కార్డులను అందించారు.  

96,060 కొత్త కార్డులకు బియ్యం..

ప్రతినెలా డైనమిక్ కీ రిజిస్ట్రర్​(డీకేఆర్) జనరేట్ చేస్తారు. జనరేట్ చేసే సమయానికి పెరిగిన, తరిగిన కార్డులు, మెంబర్ల ప్రకారమే బియ్యం కోటా అలాట్ చేస్తారు. ఏప్రిల్​25న డైనమిక్ కీ రిజిస్టర్​జనరేట్​చేసిన నాటికి పెరిగిన రేషన్​కార్డులకు, యాడ్ చేసిన మెంబర్లకు మూడు నెలల బియ్యం (ఆగస్టు వరకు) కోటా పంపిణీ చేశారు. ఏప్రిల్ 2025 నాటికి ఉమ్మడి జిల్లాలో 10,17,023 కార్డులు ఉండగా, మేలో లబ్ధిదారులకు బియ్యం అందించారు.

మే 25 నాటికి 10,29,230 రేషన్ కార్డులకు చేరగా, జూన్​లో వారందరికీ మూడు నెలల కోటా బియ్యం అందించారు. ఆ తర్వాత మే 25 నుంచి ఆగస్టు 9 వరకు కొత్తగా 96,060 కార్డులు మంజూరు చేశారు. దీంతో ఉమ్మడి జిల్లాలో రేషన్ కార్డుల సంఖ్య 11,25,290కు చేరింది. ఈ రేషన్​కార్డుల్లో మొత్తంగా 34,05,671 మంది మెంబర్లుగా ఉన్నారు. వీరందరికీ 20,434 టన్నుల బియ్యం అందించనున్నారు. 

20 నుంచి షాపులకు..

కేంద్ర ప్రభుత్వం తన పరిధిలోని ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులకు సంబంధించిన బియ్యం కోటా అలాట్ చేసింది. స్టేట్​ గవర్నమెంట్​త్వరలో కోటా అలాట్ చేయనుంది. రేషన్​కార్డుల లబ్ధిదారుల కోసం అలాట్ చేసిన బియ్యం స్టేజ్​–-1లో కేటాయించిన బియ్యం జిల్లాల్లోని గోడౌన్​లకు చేరుతుంది. స్టేజ్–-2లో ఈనెల 20 నుంచి గోదాముల్లో నిల్వ ఉన్న బియ్యం స్టాక్​ను రేషన్ షాపులకు తరలిస్తారు. సెప్టెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు బియ్యం పంపిణీ ప్రారంభిస్తారు. 

సెప్టెంబర్​లోని పంపిణీ చేయనున్న కార్డులు, బియ్యం(టన్నుల్లో)

జిల్లా                   కార్డులు    యూనిట్లు    పంపిణీ చేసే బియ్యం

నల్గొండ             5,27,894     16,02,987       9618.28
సూర్యాపేట      3,58,076     10,46,911       6281.46
యాదాద్రి          2,39,320     7,55,773         4534.63