బంగారంతో కోటీశ్వడు అయిపోవచ్చని అనుకున్నాడేమో.. ఏకంగా పనిచేసే షాపుకే కన్నం వేశాడు ఉద్యోగి. పంజాగుట్ట జోయాలుక్కాస్లో భారీ చోరీ చేశాడు అందులో పనిచేసే ఉద్యోగి. ఏకంగా కోటి 65 లక్షల విలువైన బంగారం ఎత్తుకెళ్లాడు. పంజాగుట్ట పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. అందులో పనిచేసే సేల్స్ మ్యాన్ గుంటూరు జిల్లా తాడేపల్లి గూడెంకు చెందిన కారంపూడి గోపాలకృష్ణ ప్రతి రోజు కొద్దికొద్దిగా కిలో బంగారం బిస్కెట్లు చోరీ చేశాడు. ఆడిటింగ్లో బయటపడటంతో యాజమాన్యం సీసీ ఫుటేజ్ ను పరిశీలించింది. గోపాల కృష్ణ షూ సాక్స్లో గోల్డ్ దాచి చోరీకి పాల్పడినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. బంగారం ఎత్తుకెళ్లిన ఉద్యోగిపై యాజమాన్యం పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి 24 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. సీసీ కెమెరాలు,టెక్నికల్ ఎవిడెన్స్ తో నిందితుడిని 24 గంటల్లోనే పట్టుకున్నారు. అతడి నుంచి పది గోల్డ్ బిస్కెట్లు(ఒక్కొక్కటి100 గ్రాములు) 1000 గ్రాముల బంగారాన్ని్ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ కోటి 65 లక్షలు ఉంటుందని చెప్పారు. నిందితుడి నుంచి మొబైల్, బజాజ్ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు.
