- నేడే చైర్పర్సన్, చైర్మన్ల ఎన్నిక
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో 4 మున్సిపాలిటీలకు 3 చోట్ల కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాగా, కామారెడ్డిలో మాత్రం హంగ్ ఏర్పడింది. అక్కడ పదవిని కాంగ్రెస్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మొత్తం 49 మంది కౌన్సిలర్లు ఉండగా కాంగ్రెస్ 19, బీఆర్ఎస్ 11, బీజేపీ 16, ఇండిపెండెంట్లు 3 గెలిచారు. ఇండిపెండెంట్లుగా గెలిచిన ముగ్గురు సభ్యులు కాంగ్రెస్ వారితో కలిసి క్యాంపుకు వెళ్లారు. దీంతో కాంగ్రెస్ బలం 22 సభ్యుల సంఖ్య చేరింది. మ్యాజిక్ ఫిగర్ 25 కావాలి. దీంతో మరో ముగ్గురు సభ్యుల మద్దతు అవసరముంది.
సోమవారం చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సమావేశం నిర్వహించనున్నారు. ఈ మీటింగ్లో కాంగ్రెస్ చైర్ పర్సన్ పదవిని దక్కించుకుంటుందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. చైర్పర్సన్ పదవిని సురోజ్ వనిత, హర్షితతో పాటు ఇండిపెండెంట్గా గెలిచి కాంగ్రెస్ వైపు వెళ్లిన ఈప్ప ఉమారాణి ఆశిస్తున్నారు.
ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచిన ఈప్ప ఉమారాణి కి చైర్ పర్సన్ పదవి ఇస్తే బీఆర్ఎస్ మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. హైదరాబాద్ శివారులో క్యాంపులో ఉన్న కాంగ్రెస్ కౌన్సిలర్లతో ఆదివారం జహీరాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి మంత్రి అజారుద్ధీన్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షేట్కార్, మహిళ కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద, డీసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున్ సమావేశం అయ్యారు. పార్టీ అభ్యర్థిని ఎంపిక చేసి, సీల్డు కవర్లో పేరు పంపనునన్నట్లు తెలిపారు.
బీఆర్ఎస్ ను వీడినట్టు ప్రచారం!
బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన 11 మంది కౌన్సిలర్లు మాజీ ఎమ్మెల్యే గంప గోవర్దన్, పార్టీ జిల్లా ప్రెసిడెంట్ ముజిబొద్దిన్ ఆధ్వర్యంలో క్యాంపులో ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం నలుగురు సభ్యులు పార్టీని వీడి కాంగ్రెస్ వెళ్లారని కామారెడ్డిలో ప్రచారం జరిగింది. అలర్టు అయిన ఆ పార్టీ కౌన్సిలర్లు తాము ఎక్కడికి వెళ్లలేదని బీఆర్ఎస్లోనే ఉన్నామంటే వీడియో రిలీజ్ చేశారు. హైదరాబాద్ శివారులో క్యాంపుల్లో ఉన్న ఆయా పార్టీల కౌన్సిలర్లు సోమవారం నేరుగా మీటింగ్కు రానున్నారు.
బోధన్ చైర్ పర్సన్ పదవి కాంగ్రెస్కే...
నిజామాబాద్: జిల్లాలోని నగర పాలక సంస్థతో పాటు బోధన్ మున్సిపాలిటీల్లో పీఠాలు దక్కించుకోడానికి కాంగ్రెస్ లీడర్లు కసరత్తు చేస్తున్నారు. హంగ్ రిజల్టు వచ్చిన ఈ రెండు చోట్లా మజ్లిస్ మద్ధతు ఇచ్చింది. ప్రతిఫలంగా మజ్లిస్కు వైస్చైర్మన్ ఇవ్వడానికి కాంగ్రెస్ రెడీ అయింది. ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీలో పూర్తి ఆధిక్యంతో ఉన్న కాంగ్రెస్ రెండు చోట్ల ప్రధాన పదవులు గెలుచుకోవడం లాంఛనమే కానుంది.
పదవుల కోసం పోటీ ఉన్నందున ఏకాభిప్రాయం కోసం పార్టీ నేతలు శని, ఆదివారం రెండు రోజులు నుంచి చర్చలు జరిపారు. బోధన్ మున్సిపాలిటీలో మొత్తం 38 వార్డులుండగా కాంగ్రెస్ పార్టీ 17 స్థానాలు గెలిచింది. మజ్లిస్ 12, బీఆర్ఎస్ 05, బీజేపీ 3 వార్డులు గెలుచుకోగా రెబెల్గా పోటీ చేసి గెలిచిన అభ్యర్థి కాంగ్రెస్లో చేరడంతో బలం18కు చేరింది.
చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులకు 20 ఓట్లు అవసరం. స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి ఎక్స్ అఫిషియో ఓటు కలిపితే మ్యాజిక్ ఫిగర్కు ఒక ఓటుకు దూరంలో ఉంటుంది. దీంతో మరొకరి ఓటు అవసరం అవుతుంది. కాంగ్రెస్ చైర్పర్సన్ అభ్యర్థిగా శరత్రెడ్డి భార్య తూము పద్మ కాకుండా ఇంకెవరిని సెలెక్ట్ చేసినా బీఆర్ఎస్ మద్దతు ఇస్తామని చెప్పినట్టు తెలుస్తోంది.మజ్లిస్ పార్టీ కుడా శరత్ దంపతులను కాకుండా ఎవరికి పదవి ఇచ్చినా మద్దతిస్తామని చెప్తూనే.. చైర్మన్ పదవి తమకే ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా ముందుచినట్టు తెలుస్తోంది.
ఆదివారం చర్చలు కొలిక్కివచ్చి రెండు పార్టీల మధ్య అవగాహన కుదిరింది. మజ్లిస్కు వైస్చైర్మన్ కాంగ్రెస్కు చైర్పర్సన్ పదవి ఇచ్చేలా పరస్పర అంగీకారం కుదుర్చుకున్నారు. జనరల్ కు రిజర్వు చేసిన చైర్పర్సన్ పదవిని శరత్రెడ్డి, ఆయన భార్య తూము పద్మ, దాము, ఆదినారాయణ పేర్లు పరిశీలిస్తున్నారు. సోమవారం సీల్ కవర్లో పేరు ఓపెన్ కానుంది.
ఆర్మూర్, భీంగల్లో బీసీ మహిళల పరిశీలన
ఆర్మూర్లోని 36 వార్డుల్లో 19 స్థానాలు గెలిచిన కాంగ్రెస్కు క్లియర్కట్ మెజారిటీ ఉంది. మరో ఇద్దరు ఇండిపెండెంట్లు మద్దతు ఇస్తున్నారు. జనరల్ మహిళకు రిజర్వు చేసిన ఛైర్పర్సన్ స్థానం కోసం పోటీ చేసిన అంకరిగారి శ్రీదేవీ, ఖాందేష్ సంగీత, మోత్కూరి విజయ, గడ్డం జ్యోతి ఓటమిపాలయ్యారు. గెలిచిన వారిలో గోనె లహరి, బస్నాత్ తిరుమల, తాటి నీలిమ పేర్లను ఛైర్పర్సన్ పోస్టులకు పరిశీలిస్తున్నారు. వీరంతా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళలే. భీంగల్ మున్సిపాలిటీలోని 12 వార్డుల్లో 8 స్థానాలు గెలిచిన కాంగ్రెస్కు ఛైర్పర్సన్, వైస్ ఛైర్పర్సన్ పదవులు పొందడం లాంఛనం కానుంది.
జనరల్ మహిళకు కేటాయించిన ఛైర్పర్సన్ పోస్టుకు బీసీ వర్గానికి చెందిన 6 వార్డు కౌన్సిలర్ బొదిరె నాగమణి, 1 వార్డు కౌన్సిలర్గా గెలిచిన అరెపల్లి శ్రీజలో ఒకర్ని ఫైనల్ చేయనున్నారు. సీల్ కవర్లోనే పేర్లు వెల్లడయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
3 చోట్ల సునాయాసంగా గెలిచే చాన్స్
బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపాలిటీల్లో మెజార్టీ కౌన్సిలర్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. ఈ 3 చోట్ల ఎవరి మద్దతు లేకుండా ఆ పార్టీకి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు దక్కనున్నాయి. బాన్సువాడ ఛైర్పర్సన్ కాసుల విజయ పేరును ముందుగానే ఆ పార్టీ నేతలు ప్రకటించారు. ఎల్లారెడ్డిలో చైర్మన్ పదవి కోసం పద్మ శ్రీకాంత్, భాగ్యలక్ష్మీ, బిచ్కుందలో మఠం మానస, షీమా షేట్కార్లో ఏవరో ఒకరికి ఛైర్మన్ పదవి దక్కనుంది. ఛైర్మన్ పదవుల కోసం ఎంపిక చేసి వారి పేర్లను కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం ఎన్నిక సమయానికి ముందు సీల్డు కవర్లో పంపనుంది.
