జూడాల సమ్మె పరిష్కరించాలని కేసీఆర్ ఆదేశం

 జూడాల సమ్మె పరిష్కరించాలని కేసీఆర్ ఆదేశం

హైదరాబాద్: జూనియర్ డాక్టర్ల సమ్మెపై సీఎ కేసీఆర్ స్పందించారు. ముఖ్య అధికారులతో  మాట్లాడిన ఆయన జూనియర్ డాక్టర్ల సమస్యలపై ఆరా తీశారు. జూనియర్ డాక్టర్ల డిమాండ్లు, వారి సమస్యలను వివరించగా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. బుధవారం నాడు ప్రగతి భవన్ లో వైద్యశాఖ అధికారులతో రాష్ట్రంలో  కరోనా పరిస్థితి, వాక్సినేషన్ కార్యక్రమం, తదితర అంశాల మీద ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్ల విషయాన్ని వైద్యాధికారులు, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకురాగా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
సీనియర్ రెసిడెంట్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని 15 శాతం పెంచాలని, 3 ఏళ్లు వైద్య విద్య అభ్యసించి కోవిడ్ సేవల కొరకు కొనసాగుతున్న వైద్య విద్యార్దులకు కూడా సీనియర్ రెసిడెంట్లకిచ్చే గౌరవ వేతనాన్ని అందించాలని సిఎం నిర్ణయించారు. కరోనా సేవలందిస్తున్న నేపథ్యంలో జూనియర్ డాక్టర్లకు, వారి కుటుంబ సభ్యులకు  నిమ్స్ లో ఇప్పటికే అందిస్తున్న వైద్య సేవలను మరింత మెరుగ్గా అందించాలన్నారు. ప్రభుత్వం ఇప్పటికే నిబంధనలమేరకు ఎక్స్ గ్రేషియాను కూడా అందిస్తున్న నేపథ్యంలో ప్రస్థుతం వారి కోరిక మేరకు సత్వరమే అందించాలని ...అధికారులను  సిఎం కెసిఆర్  ఆదేశించారు. ఈ మేరకు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.
సమ్మెపై కేసీఆర్ అసంతృప్తి    
కరోనా విపత్కర పరిస్థితుల్లో జూనియర్ డాక్టర్లు సమ్మెకు పిలుపునివ్వడం మంచిది కాదని, ఇటువంటి కీలక సమయంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో వుంచుకుని తక్షణమే విధుల్లో చేరాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు జూనియర్ డాక్టర్లకు సూచించారు. ప్రభుత్వం, జూనియర్ డాక్టర్ల పట్ల ఏనాడూ వివక్ష చూపలేదని వారి సమస్యలను పరిష్కరిస్తూనే వున్నదని ఇప్పుడు కూడా న్యాయమైన కోరికలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా వున్నదని సిఎం స్పష్టం చేశారు. వారి సమస్యలపై సిఎం మాట్లాడుతూ....‘‘జూనియర్ డాక్టర్లవి న్యాయమైన కోరికలు అయినపుడు,  పరిష్కరించడానికి ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం వుండబోదు. వాటిని ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవచ్చు. అంతేకానీ, చీటికి మాటికి ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా, సమయ సందర్భాలను కూడా చూడకుండా, సమ్మె పేరుతో విధులను బహిష్కరించడం సరియైన పద్దతి కాదన్నారు. అదీకూడా, కరోనా వంటి అత్యవసర పరిస్థితుల్లో ఇటువంటి నిర్ణయాన్ని ప్రజలు హర్షించరు’’ అని సిఎం కేసీఆర్ పేర్కొన్నారు.  కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్, సిఎం కార్యదర్శి, సిఎంవో కోవిడ్ ప్రత్యేకాధికారి రాజశేఖర్ రెడ్డి, హెల్త్ సెక్రటరీ ఎస్ఎఎం రిజ్వీ, డిఎంఈ రమేశ్ రెడ్డి, డైరక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు, సిఎం ఓఎస్డీ గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.