నగర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి

నగర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి

హైదరాబాద్: భారీ వర్షాల వల్ల నగర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఏర్పడిన పరిస్థితుల గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‎తో సమీక్షించారు. గులాబ్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు మరో రెండు రోజుల పాటు కురుస్తాయని, ఈ పరిస్థితుల్లో ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్‎ను ముఖ్యమంత్రి ఆదేశించారు. పోలీస్, రెవిన్యూ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు. కాగా.. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో మరోసారి జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్‎లో సీఎస్‎తో పాటు డీజీపీ మహేందర్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ స్పెషల్ సీఎస్ సునీల్ శర్మ, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్బంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాలో రెవిన్యూ, పోలీస్, పంచాయితీ రాజ్, నీటిపారుదల, ఫైర్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని సోమేశ్ కుమార్ ఆదేశించారు. అవసరమైతే.. హైదరాబాద్, కొత్తగూడెం, వరంగల్‎లలో ఉన్న ఎన్.డీ.ఆర్.ఎఫ్ బృందాలను ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. ప్రతీ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి.. ఎప్పటికప్పుడు సమాచారాన్ని సచివాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‎కు సమాచారం అందించాలని ఆయన  అన్నారు. సమస్యాత్మక ప్రాంతాలైన లోతట్టు ప్రాంతాలు, చెరువులు, కుంటలు, బ్రిడ్జిల వద్ద ప్రత్యేకంగా అధికారులను నియమించి పరిస్థితులను సమీక్షించాలని అన్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకొని పనిచేయాలని పోలీస్ కమీషనర్లు, ఎస్పీలను ఆదేశించామని ఆయన తెలిపారు. ఈ మేరకు పోలీస్ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు మహేందర్ రెడ్డి తెలిపారు.

For More News..

స్విగ్గీలో ప్రగతిభవన్‎కు లిక్కర్ బాటిల్ బుక్ చేయండి

వ్యాక్సిన్ కోసం వర్షాన్ని లెక్కచేయకుండా..

అసెంబ్లీ ముందు ఆటోడ్రైవర్ ఆత్మహత్యాయత్నం