- పేదలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే వైద్యం చేయించుకోవాలె
- వైద్య, ఆరోగ్య రంగం పటిష్టం చేసేందుకు కృషి
హైదరాబాద్: దోపిడీకి గురికాకుండా పేదలు ప్రభుత్వ దవాఖాన్లలోనే వైద్యసేవలు పొందాలన్నారు సీఎం కేసీఆర్. సోమవారం హైదరాబాద్ లో 3 టిమ్స్ హాస్పిటల్స్ నిర్మాణాలకు భూమి పూజ చేసిన అనంతరం అల్వాల్ సభలో మాట్లాడిన సీఎం..హైదరాబాద్ లో 6 వేల పడకలకు ఆక్సిజన్ సౌకర్యం ఉందన్నారు. మతం, కులం పేరు మీద కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని..భిన్నత్వంలో ఏకత్వం ఉన్న సమాజం మనదన్నారు. మన భారతీయులు 13 కోట్ల మంది విదేశాల్లో పనిచేస్తున్నారని తెలిపారు కేసీఆర్. వారందరినీ అక్కడి ప్రభుత్వాలు పంపేస్తే ఉద్యోగాలెవరిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగా లేకపోతే పెట్టుబడులు వస్తాయా? అన్నారు. పెద్ద రాష్ట్రాలను అధిగమించి మన తలసరి ఆదాయం అధికంగా ఉందన్నారు. సంపద సృష్టించి పేదలకు పంచుతున్నామన్నకేసీఆర్..ఒక్క ఏపీ తప్ప మనం ఇస్తున్నంత ఫించన్ మరెక్కడా ఇవ్వటం లేదన్నారు.
నేడు మన వద్ద కరెంటు పోతే వార్త...దేశంలో కరెంటు ఉంటే వార్త అన్నారు. గుజరాత్ లోనూ కరెంటు కోసం రైతులు, ప్రజలు ఆందోళనలు చేస్తున్నారన్నారు. ఒకప్పుడు రాష్ట్రంలో ఎండాకాలంలో తీవ్ర విద్యుత్ కొరత ఉండేదని.. అన్ని సమస్యలను అధిగమించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. ఇప్పుడు వైద్య, ఆరోగ్య రంగం పటిష్టం చేసేందుకు కృషిచేస్తున్నామని.. దేశానికి రాష్ట్రం ఆదర్శంగా ఉండేలా మీ ఆశీర్వాదం ఉండాలని కోరుతున్నా అన్నారు. స్థలం దొరకని ప్రాంతాల్లోనూ ఇన్ని ఎకరాలను తీసుకుని ఆస్పత్రి నిర్మించడం సంతోషకరమని తెలిపారు సీఎం కేసీఆర్.