ఏర్పాట్లు చేయాలని మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశం
వనపర్తి, వెలుగు: జూలై ఫస్ట్ వీక్లో వనపర్తి కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ రానున్నారని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తో కలిసి కొత్త కలెక్టరేట్ , సీఎం పర్యటనపై జిల్లా ఆఫీసర్లతో సమీక్షించారు. సీఎం కేసీఆర్ పర్యటనలో భాగంగా కలెక్టరేట్తో పాటు పట్టణంలో నాలుగులేన్ల రోడ్డు , ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ మార్కెట్, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ , టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులను ప్రారంభిస్తారని చెప్పారు. అలాగే మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. మరో వారంలో పెండింగ్ పనులు కంప్లీట్ చేయాలని సూచించారు. కలెక్టరేట్ ఆవరణలో 10వేల మందితో సమావేశం నిర్వహించే అవకాశాలపై మంత్రి ఆఫీసర్ల అభిప్రాయం తీసుకున్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లను కూడా సీఎం చేతుల మీదుగా లబ్ధిదారులకు అందిస్తే బాగుంటుందని, పీర్లగుట్టపై జరుగుతున్న పనులను 10 రోజుల్లో కంప్లీట్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హెలీప్యాడ్, పార్కింగ్, సభ తదితర ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. అనంతరం 10 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. డీఎంహెచ్ వో చందు నాయక్, ఇతర జిల్లా ఆఫీసర్లు ఉన్నారు.