
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలకు నాలుగు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్.. ప్రచారంపై మాత్రం వెయిట్ అండ్ సీ ధోరణిని అనుసరిస్తున్నది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు తెరపైకి వచ్చినప్పటి నుంచీ ఆచితూచి అడుగులేస్తున్నది. ‘‘తొందరపడకండి. ప్రచార వేగం తగ్గించండి. పార్లమెంట్ సమావేశాలు అయ్యేదాకా వెయిట్ చేద్దాం. అప్పటిదాకా నిదానంగా ప్లాన్ చేసుకోండి..’’ అని పలువురు అభ్యర్థులకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇప్పటికే సూచించినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. జమిలి ఎన్నికలు రావొచ్చన్న వార్తలతోపాటు మహిళా బిల్లుకు కేంద్రం ఆమోదం తెలిపే అవకాశాలున్నాయని జాతీయస్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండటంతో పార్లమెంట్ సమావేశాలు అయ్యేంత దాకా అసెంబ్లీ ఎన్నికల హడావుడి తగ్గించుకోవాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది.
అభ్యర్థిత్వం ఖరారు కాగానే జోష్ పెంచిన సిట్టింగులు ఇప్పుడు గప్చుప్ అయ్యారు. ఏకంగా పార్టీ అధినేత ఆదేశాలు ఉండటంతో.. హైదరాబాద్కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు ప్రచారాన్ని ఆపి, ఫారిన్ ట్రిప్పులు ప్లాన్ చేసుకున్నారు. ఇందులో ఇప్పటికే పలువురు విదేశీ పర్యటనల్లో ఉన్నారు. దక్షిణ తెలంగాణకు చెందిన ఆరుగురు, ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన ముగ్గురు బీఆర్ఎస్ అభ్యర్థులు దుబాయ్తో పాటు మలేషియా, సింగపూర్లో పర్యటిస్తున్నారు. ఇంకొందరు ఆఫ్రికా దేశాలకు వెళ్లినట్లు వారి అనుచరులు చెప్తున్నారు.
ఖర్చు భయంతోనూ..!
ఎన్నికల ఖర్చు భయం కూడా అభ్యర్థులను వెంటాడుతున్నది. అభ్యర్థిత్వాలు ఖరారైనప్పటి నుంచీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అభ్యర్థుల ఇండ్ల దగ్గర లీడర్లు, కార్యకర్తల హడావుడి నడుస్తున్నది. పొద్దున లేచింది మొదలు అర్ధరాత్రి వరకు అనుచరులు, పార్టీ కార్యకర్తలతో ఎమ్మెల్యేల ఆఫీసులు కిక్కిరిసిపోతున్నాయి. వీరికి టిఫిన్ల నుంచి డిన్నర్ వరకు ఖర్చులతో పాటు.. వరుసగా ర్యాలీలు, విలేజీ టూర్లతో ఖర్చు తడిసి మోపెడవుతున్నదని ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ప్రచారంపై ఇప్పుడే తొందరొద్దని అధిష్టానం చెప్పడంతో.. అభ్యర్థులకు ఎన్నికల ఖర్చు నుంచి కాస్త ఊపిరి పీల్చుకున్నట్లయింది. తీర్థయాత్రలు, విహార యాత్రలు అంటూ అనుచరులకు తలోతీరుగా ఏదో ఒకటి చెప్పి పలువురు అభ్యర్థులు హైదరాబాద్లో ఉంటున్నారు. సెగ్మెంట్లో ఉంటే రోజూ పండుగలా ఖర్చు చేయాల్సి వస్తుందని, ఇప్పుడే అంతా ఖర్చు పెట్టేస్తే అసలు టైమ్లో సమస్య అవుతుందని ఇప్పటికే హైదరాబాద్లో తన భూమిని అమ్మకానికి పెట్టిన ఓ కీలక నేత కామెంట్ చేశారు.
జమిలి, మహిళా కోటా ఓకే అయితే..!
తెలంగాణతో పాటే మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్, మిజోరం అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అక్టోబర్లో ఎన్నికల షెడ్యూల్ప్రకటించి డిసెంబర్రెండో వారం నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తారని అంతా భావించారు. సెంట్రల్ ఎలక్షన్కమిషన్ కూడా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ షురూ చేసింది. ఈ నెల 19 నుంచి నిర్వహించే పార్లమెంట్ ప్రత్యేక సెషన్లో జమిలి ఎన్నికల ప్రతిపాదన ప్రవేశపెట్టే అవకాశముందని ఢిల్లీ సర్కిల్స్లో చర్చ నడుస్తున్నది. అదేవిధంగా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ప్రవేశపెట్టే చాన్స్ ఉన్నట్లు తెలుస్తున్నది. మహిళల కోటాపై ఇటీవల ఉప రాష్ట్రపతి జయదీప్ ధన్కడ్ కామెంట్ చేయడంతో ఈ సెషన్లోనే బిల్లు తేవడం ఖాయమని ప్రచారం జరుగుతున్నది. జమిలి ఎన్నికలు, చట్ట సభల్లో మహిళల కోటా వస్తే సీన్ మొత్తం మారిపోతుంది. డిసెంబర్లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. దీంతో జమిలిపై పార్లమెంట్ సెషన్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూసి ముందుకు సాగాలని బీఆర్ఎస్ భావిస్తున్నది. మహిళలకు 33 శాతం కోటా ఇస్తే ఇప్పుడు ప్రకటించిన ఏడుగురు మహిళా అభ్యర్థులతోపాటు కొత్తగా 32 మంది మహిళలకు సీట్లు ఇవ్వాలి. దీంతో అభ్యర్థులను మార్చక తప్పదు. ఈ కారణంతోనూ ఎన్నికల ప్రచారంలో వేగం తగ్గించాలని పార్టీ అభ్యర్థులకు కేసీఆర్సూచించినట్టుగా బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి.
తలో దిక్కు!
తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించింది మొదలు మొన్నటివరకు సెగ్మెంట్లోనే మకాం వేసి హడావుడి చేసిన హైదరాబాద్ నగరానికి చెందిన ఒక ఎమ్మెల్యే.. ఇప్పుడు దుబాయికి వెళ్లిపోయారు. పది రోజుల పాటు అక్కడే ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. తన వెంట కొందరు లీడర్లను కూడా ఆయన అరబ్ దేశానికి తీసుకెళ్లారు. ఎన్నికల ప్రచారానికి ఇప్పుడే తొందరొద్దని బీఆర్ఎస్ అధిష్టానం నుంచి ఆదేశాలు అందడంతో ఇట్ల చాలా మంది అభ్యర్థులు టూర్ల బాట పట్టారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే ప్రచారానికి బ్రేక్ ఇచ్చి.. పొరుగు రాష్ట్రానికి వెళ్లారు. అక్కడ తన వ్యాపార కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. మరికొందరు ఎమ్మెల్యేలు వినాయక చవితిలోపు ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్లు చేపట్టాలని, లేదంటే దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించాలని ప్లాన్ చేసుకుంటున్నారు.