
- ప్రభుత్వానికి అందిన ప్రాథమిక ప్రతిపాదనలు
- వివిధ గ్రీన్ ఫార్మా కంపెనీలతో పాటు పలు యూనివర్సిటీలు,
- సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలకు భూములు
- రెండేండ్లలోనే వర్క్ మోడ్లోకి తీసుకొచ్చేలా ప్రణాళిక
- ఫ్యూచర్ సిటీ భూసేకరణ త్వరగా పూర్తి చేయాలి: సీఎం రేవంత్
- పరిశ్రమల శాఖపై సమీక్ష
హైదరాబాద్, వెలుగు: దాదాపు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న భారత్ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయి. ఇప్పటికే అక్కడ స్కిల్ యూనివర్సిటీ పనులు మొదలు కాగా.. ఫ్యూచర్ సిటీ పనులు వచ్చే నెలలో ప్రారంభించనున్నట్లు తెలుస్తున్నది. రెండు, మూడు నెలల వ్యవధిలోనే పూర్తిస్థాయిలో ఫ్యూచర్ సిటీ నిర్మాణం మొదలుపెట్టేలా ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నది. దేశంలోనే ఇది మొదటి ‘నెట్-జీరో గ్రీన్ఫీల్డ్ సిటీ’ కానున్నది. ఈ నగరం నుంచి వాతావరణంలోకి విడుదలయ్యే కాలుష్యం దాదాపు సున్నా ఉంటుంది. ప్రపంచస్థాయి గ్రీన్ ఫార్మా కంపెనీలు, యూనివర్సిటీలు, వేగంగా అభివృద్ధి చెందుతున్న సాఫ్ట్వేర్ పరిశ్రమలు ఒకేచోట కొలువుదీరనున్నాయి. ఇది పరిశ్రమ, విద్య, సాంకేతికతకు మధ్య ఒక సంధానకర్తగా వ్యవహరించి, సరికొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమం చేస్తుందని ప్రభుత్వం చెబుతున్నది.
వివిధ భాగాలుగా విభజించి..
ఫ్యూచర్ సిటీని వివిధ భాగాలుగా విభజించారు. ఇందులో ఎలక్ట్రిక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, గ్రీన్ బిల్డింగ్, స్మార్ట్ లివింగ్ ఎకో సిస్టమ్ ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), ఫార్మా హబ్, స్పోర్ట్స్ సిటీ, క్లీన్ ఎనర్జీ ఇన్నొవేషన్ లాంటి ప్రత్యేక జోన్లు ఉంటాయి. ఫోర్త్ సిటీలో పారిశ్రామిక, పర్యాటక, ఆతిథ్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటికే బేగరికంచెలో స్కిల్ యూనివర్సిటీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని నిర్మాణాలూ పర్యావరణానికి హాని చేయకుండా, స్మార్ట్ సిటీ నియమాలకు లోబడి ఉండేలా చూడనున్నారు. ఏడు మండలాల్లోని 56 గ్రామాల పరిధిలో దాదాపు 30 వేల ఎకరాల్లో భారత్ సిటీని ఏర్పాటు చేసే మాస్టర్ప్లాన్ను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది.
ఇందులో దాదాపు 15 వేల ఎకరాలు ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. దీనిని మరింత ఎకో ఫ్రెండ్లీగా నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫార్మాసిటీ కోసం టీజీఐఐసీ ఇప్పటికే 14 వేల ఎకరాల భూమిని సేకరించింది. దాదాపు రెండున్నర వేల ఎకరాల ఇష్యూ కోర్టులో ఉన్నది. దీనిని త్వరలోనే క్లియర్ చేసి.. మాస్టర్ ప్లాన్ లో ఇంక్లూడ్ చేయనున్నారు. ఈ భూముల వరకూ ఒక మాస్టర్ ప్లాన్, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ) పరిధి విస్తరించి ఉన్న సుమారు 2 లక్షల ఎకరాల వరకూ మరోటి రూపొందిస్తున్నారు.
రెండేండ్ల వ్యవధిలోనే..
ఈ ఫ్యూచర్ సిటీని కేవలం రెండేళ్ల వ్యవధిలోనే పూర్తిగా వర్క్ మోడ్లోకి తీసుకురావాలని ప్రభు త్వం లక్ష్యంగా పెట్టుకున్నది. దీంతో వేలాది మంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ సిటీని ప్లాన్ చేయడానికి, అభివృద్ధి చేయడానికి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అనే సంస్థను ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఈ సంస్థ సిటీని ఎలా నిర్మించాలి? ఎలాంటి సౌకర్యాలు ఉండాలి? పెట్టుబడులు ఎలా పెట్టాలి? లాంటి విషయాలపై పూర్తి వివరాలతో కూడిన పత్రాలను సిద్ధం చేసింది. ఈ సిటీలో ఇండ్లు చాలా ఆధునికంగా, విద్యుత్ ఆదా చేసే విధంగా ఉంటాయి. తక్కువ ఆదాయం ఉన్నవాళ్లకు కూడా అందుబాటు ధరల్లో ఇండ్లు ఉంటాయి.
ఆరోగ్యం, విద్య, వినోదానికి సంబంధించిన అన్ని సౌకర్యాలు దగ్గర్లోనే ఉంటాయి. ప్రతి ఇంటి పరిసరాల్లో పార్కులు, ఆట స్థలాలు, కల్చరల్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తారు, ఫ్యూచర్ సిటీలో కాలుష్యం లేకుండా (నెట్-జీరో) ఉండడమే ప్రధాన లక్ష్యం. దీని కోసం పునరుత్పాదక శక్తిని (సౌరశక్తి లాంటివి) ఎక్కువగా ఉపయోగిస్తారు. గ్రీన్ బిల్డింగ్స్, నీటిని ఆదా చేసే పద్ధతులు, చెత్తను సరిగ్గా నిర్వహించడం, ఎలక్ట్రిక్ వాహనాలు వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు. ఈ సిటీలో వ్యాపారాలు చేసేవాళ్లు కూడా ఈ పర్యావరణ నియమాలను తప్పనిసరిగా పాటించాలి.
ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షించేందుకు ప్రోత్సాహకాలు
ఫ్యూచర్ సిటీలో దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. ముఖ్యంగా ఏఐ, ఫిన్టెక్ , లైఫ్ సైన్సెస్, గ్రీన్ టెక్నాలజీస్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి సులభమైన ప్రక్రియను ఏర్పాటు చేశారు. ఏఐకి 297 ఎకరాలు, విశ్వవిద్యాలయ జోన్ కు 454 ఎకరాలు, ఎంటర్టైన్మెంట్కు 470 ఎకరాలు, ఫార్మా పార్క్ కు 309 ఎకరాలు, హెల్త్ సిటీకి 370 ఎకరాలు, స్పోర్ట్స్ హబ్ కు 761కు ఎకరాలను ఇచ్చేందుకు ప్రాథమికంగా ప్లాన్ రెడీ చేశారు. ఇప్పటికే ఫ్యూచర్ సిటీలో గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి ప్రతిపాదనలు, టెండర్లు పూర్తయ్యాయి.
మెట్రో రైలు మార్గాన్ని కూడా భారత్ ప్యూచర్ సిటీ లోపలి వరకు నిర్మించేందుకు హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ సర్వే చేపట్టి సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించింది. ఈ మేరకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఔటర్ రింగురోడ్డు మీదుగా కొంగరకలాన్ ఎగ్జిట్ నుంచి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ మీదుగా మీర్ఖాన్పేట వరకు సుమారు 39.6 కిలో మీటర్ల మేర మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేందుకు డీపీఆర్ను హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రభుత్వానికి నివేదించింది.
ఫ్యూచర్ సిటీలో డేటా సెంటర్ల ఏర్పాటు : సీఎం రేవంత్
ఫ్యూచర్ సిటీ భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో పరిశ్రమల శాఖపై సీఎం రేవంత్ శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఫ్యూచర్ సిటీలో డేటా సెంటర్ల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు సూచించారు. ఇందుకోసం కావాల్సిన స్థలం సిద్ధం చేయాలని ఆదేశించారు. పెట్టుబడుల కోసం రాష్ట్రానికి వచ్చే పారిశ్రామికవేత్తలు ఎవరూ వెనక్కు వెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేశారు. నిమ్జ్లో మిగిలి ఉన్న భూ సేకరణను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులతో మాట్లాడి భూములు ఇవ్వడానికి ఒప్పించాలని సూచించారు.
ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్
ఫ్యూచర్ సిటీలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం అంతర్జాతీయస్థాయి స్పోర్ట్స్ ఆర్కిటెక్చర్స్ను నియమించుకోవాలని ఆదేశించారు. ఇందులో క్రికెట్, ఫుట్బాల్, గోల్ఫ్ వంటి అన్ని క్రీడలు ఉండేలా ప్లాన్ చేయాలని సూచించారు. మెగా ప్రాజెక్ట్స్పైన మంత్రి వర్గ ఉపసంఘం ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశం నిర్వహించి, ప్రతిపాదిత ప్రాజెక్ట్స్పైన చర్చించాలని నిర్దేశించారు. 2024లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ వచ్చాయని తెలిపారు.
2025లో ఇప్పటికే 25 సెంటర్స్ వచ్చాయని, మరిన్ని సెంటర్స్ వచ్చేలా కృషి చేయాలని ఆదేశించారు. వందరోజుల ప్రణాళికను సిద్ధం చేసుకొని, పని చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో మంత్రి శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్రెడ్డి. స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్, డైరెక్టర్ ఆఫ్ ఇండ్రస్టీస్ నిఖిల్ చక్రవర్తి, టీజీఐసీసీ వైస్ చైర్మన్ శశాంక పాల్గొన్నారు.