
- రైల్వే అధికారులకు సీఎం రేవంత్రెడ్డి సూచన
- శంషాబాద్ టు చెన్నై బుల్లెట్ ట్రైన్ కోసం రైల్వే కనెక్టివిటీ
- 362 కి.మీ. మేర రీజనల్ రింగ్ రోడ్డు వెంట రింగ్ రైలు ప్రాజెక్టు
- భూపాలపల్లి నుంచి వరంగల్ మధ్య కొత్త రైల్వే మార్గం
- హైదరాబాద్–చెన్నై, హైదరాబాద్–- బెంగుళూరు హైస్పీడ్ రైలు
- అలైన్మెంట్ ప్రతిపాదనలను మరోసారి పరిశీలించాలని సూచన..
హైదరాబాద్, వెలుగు:
రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ వరకు 12 లేన్ల గ్రీన్ ఫీల్డ్ హైవే తో పాటు దానికి తగ్గట్టు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికే గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేశామని, ఇందుకు సంబంధించి 300 కిలోమీటర్ల అలైన్మెంట్ ప్రతిపాదనలను కూడా రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిందని తెలిపారు. దానికి అనుగుణంగా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని, రైల్వే విభాగం పరిశీలనలో ఉన్న అలైన్మెంట్తోపాటు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన అలైన్మెంట్ను పరిశీలించాలని రైల్వే అధికారులకు సీఎం సూచించారు.
హైవే వెంట రైలుమార్గం ఉండాలని, హైవేకు ఇరువైపులా కిలో మీటరున్నర దూరం వరకు ఇండస్ట్రియల్ కారిడార్ను విస్తరించాలనే ప్రతిపాదనలున్నాయని ఆయన వివరించారు. శంషాబాద్ నుంచి చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్ కోసం కొత్తగా రైల్వే కనెక్టివిటీ అంశాన్నీ పరిశీలించాలన్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న రైల్వే లైన్ తో పోలిస్తే కొత్త లైన్తో దూరం కూడా తగ్గుతుందని తెలిపారు.
రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, కొత్తగా ప్రతిపాదనలో ఉన్న ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి గురువారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో దక్షిణ మధ్య రైల్వే అధికారులతో పాటు, వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్కుమార్ శ్రీవాస్తవను సీఎం రేవంత్రెడ్డి స్వాగతించారు.
కొత్త ప్రాజెక్టులపై ఆయనతో ప్రత్యేకంగా చర్చించారు. సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హామీ ప్రకారం హైదరాబాద్ నుంచి అమరావతికి ర్యాపిడ్ రైల్ అండ్ రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టును కేంద్రం అమలు చేయాల్సి ఉందన్నారు. కొత్తగా అభివృద్ధి చేస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రతిపాదనలకు తగ్గట్టు హైదరాబాద్– చెన్నై, హైదరాబాద్ – బెంగుళూరు హైస్పీడ్ రైలు ప్రాజెక్టుల సర్వే, అలైన్మెంట్ ప్రతిపాదనలను మరోసారి పరిశీలించాలని రైల్వే అధికారులకు ఆయన సూచించారు.
వికారాబాద్-కృష్ణా.. గద్వాల-డోర్నకల్ రైల్వే లైన్లను స్పీడప్ చేయాలి
హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రైల్ ఆవశ్యకతను అధికారులకు సీఎం వివరించారు. దాదాపు 362 కిలోమీటర్ల మేరకు రీజనల్ రింగ్ రోడ్డు వెంట రింగ్ రైలు ఏర్పాటు చేయటంతో హైదరాబాద్ మహా నగరం భవిష్యత్తు స్వరూపం మారిపోతుందన్నారు. వీలైనంత తొందరగా ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని రైల్వే అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. తెలంగాణ ఇండస్ట్రియల్ సెక్టార్ కోసం ప్రత్యేక రైల్వే లైన్ ఉండేలా ఈ కనెక్టివిటీ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. వికారాబాద్- – కృష్ణా కొత్త రైల్వే లైన్ పనులను వీలైనంత త్వరగా చేపట్టాలన్నారు. దీంతో పాటు గద్వాల–డోర్నకల్ రైల్వే లైన్ పనుల డీపీఆర్ పూర్తి చేసి వేగంగా చేపట్టాలని సూచించారు.
వరంగల్లోనూ రైల్వే లైన్లను అభివృద్ధి చేయాలని, భూపాలపల్లి నుంచి వరంగల్ కొత్త మార్గాన్ని పరిశీలించాలని ఆయన చెప్పారు. కాజీపేట జంక్షన్లో ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టు అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ తో పాటు వరంగల్ ను అభివృద్ధి చేయాలని, అందుకు తగిన విధంగా రైల్వే ప్రాజెక్టులను చేపట్టాలని రైల్వే ఆఫీసర్లకు సీఎం రేవంత్ సూచనలు చేశారు.
దూరాభారం, అంచనా ఖర్చును తగ్గించాలి
పెండింగ్ లో ఉన్న రైలు ప్రాజెక్టులు, లైన్లను వేగవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అవసరమైన నిధులను సమకూర్చటంతో పాటు భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టుల అలైన్మెంట్లు ఉండాలని.. దూరాభారం తగ్గించి, అంచనా ఖర్చును కూడా తగ్గించుకోవాలని సీఎం సూచించారు.
ప్రయాణికులకు వేగవంతమైన రవాణా సదుపాయాలు అందించటంతో పాటు కొత్తగా వేసే రైలు మార్గాలన్నీ ఆయా ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి ఉపయోగపడేలా ఉండాలన్నారు. ప్రధానంగా పర్యాటక కేంద్రాలు, పారిశ్రామిక అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని చెప్పారు. విదేశాల తరహాలో రైలు, రోడ్డు, పోర్ట్ కనెక్టివిటీని అధునాతనంగా అభివృద్ధి చేయాలన్నారు.
సమావేశంలో ఎంపీ కడియం కావ్య, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్ అండ్ బీ స్పెషల్ సెక్రటరీ వికాస్రాజ్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా పాల్గొన్నారు.