
- హైదరాబాద్ - విజయవాడ రహదారిని ఆరు లేన్లుగా విస్తరించండి
- ఎన్హెచ్ఏఐ, కాంట్రాక్ట్ సంస్థ మధ్య వివాదాన్ని పరిష్కరించండి
- జగిత్యాల - పెద్దపల్లి - మంథని - కాటారం రోడ్డును నేషనల్హైవేగా చేయాలని వినతి
న్యూఢిల్లీ, వెలుగు: రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగాన్ని నేషనల్ హైవేగా ప్రకటించి, ఈ ఏడాది ఎన్హెచ్ఏఐ వార్షిక ప్రణాళికలో నిధులు మంజూరు చేయాలని కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కీలకమైన హైదరాబాద్–విజయవాడ నేషనల్ హైవేను ఆరు లేన్లుగా విస్తరించాలని కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బుధవారం తుగ్లక్ రోడ్లోని తన నివాసంలో రాష్ట్ర రోడ్ల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
అనంతరం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఆయన నివాసంలో సీఎం భేటీ అయ్యారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రోడ్లు– భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, సమాచార శాఖ మంత్రి పొంగులేటి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దాదాపు రెండు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ, నూతన జాతీయ రహదారుల ప్రకటన, ఇప్పటికే జాతీయ రహదారులుగా ప్రకటించిన మార్గాల పనుల ప్రారంభం తదితర విషయాలను కేంద్ర మంత్రి గడ్కరీ దృష్టికి సీఎం రేవంత్రెడ్డి తీసుకెళ్లారు.
ఏప్రిల్ లోగా పూర్తి కావాల్సి ఉన్నా..!
హైదరాబాద్ – -విజయవాడ నేషనల్ హైవే 65ను 2024 ఏప్రిల్లోగా ఆరు లేన్లుగా విస్తరించాల్సి ఉందని కేంద్ర మంత్రికి సీఎం గుర్తుచేశారు. అయితే.. సరైన ఆదాయం రావడం లేదంటూ కాంట్రాక్ట్ సంస్థ ఆరు లేన్ల విస్తరణ పనులు చేపట్టడం లేదని తెలిపారు. ఈ రహదారిలో రోజుకు 60 వేలకుపైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని, వాహనాల రద్దీతో ప్రమాదాలు చోటు చేసుకొని పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్హెచ్ఏఐ, కాంట్రాక్ట్ సంస్థ మధ్య వివాదాన్ని పరిష్కరించి త్వరగా పనులు ప్రారంభమయ్యేలా చూడాలని ఆయన కోరారు.
మంథనికి నేషనల్ హైవే కావాలి
నేషనల్ హైవేలలో ఇప్పటి వరకు మంథనికి చోటు దక్కలేదని మంత్రి గడ్కరీ దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. అందువల్ల జగిత్యాల -– పెద్దపల్లి –- మంథని –- కాటారం రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించాలని ఆయన కోరారు. అలాగే తగిన నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ రహదారి పూర్తయితే ఎన్హెచ్-565, ఎన్హెచ్-353సీ అనుసంధానమవుతాయని సీఎం వివరించారు. తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్గఢ్ ప్రజలకు రాకపోకలకు అనువుగా ఉంటుందని.. దక్షిణ కాశీగా గుర్తింపు పొందిన కాళేశ్వరం క్షేత్రానికి అనుసంధానత పెరుగుతుందని చెప్పారు.
వీటిని నేషనల్ హైవేలుగా అప్డేట్ చేయాలి
జగిత్యాల –- కాటారం (130 కి.మీ.), దిండి –- నల్గొండ (100 కి.మీ.), భువనగిరి -– చిట్యాల (44 కి.మీ), చౌటుప్పల్ -– సంగారెడ్డి (182 కి.మీ), మరికల్ -– రామసముద్రం (63 కి.మీ.), వనపర్తి –- మంత్రాలయం (110 కి.మీ.), మన్నెగూడ -– బీదర్ (134 కి.మీ.), కరీంనగర్ - – పిట్లం (165 కి.మీ.), ఎర్రవెల్లి క్రాస్ రోడ్ - – రాయచూర్ (67 కి.మీ.), కొత్తపల్లి - – దుద్దెడ (75 కి.మీ.), సారపాక –- ఏటూరు నాగారం (93 కి.మీ.), దుద్దెడ -– రాయగిరి క్రాస్ రోడ్ (63 కి.మీ.), జగ్గయ్యపేట -– కొత్తగూడెం (100 కి.మీ.), సిరిసిల్ల -– కోరుట్ల (65 కి.మీ.), భూత్పూర్ –- సిరిగిరిపాడు (166 కి.మీ.), కరీంనగర్ -– రాయపట్నం (60 కి.మీ.) మొత్తం 1,617 కి.మీ. రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్రెడ్డి రిక్వెస్ట్ చేశారు.
సంగారెడ్డి నుంచి నర్సాపూర్- – తూప్రాన్ – గజ్వేల్ – జగదేవ్పూర్ – భువనగిరి – చౌటుప్పల్ (158.645 కి.మీ.) రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించారని, దాని భూ సేకరణకు అయ్యే వ్యయంలో సగ భాగాన్ని తమ ప్రభుత్వమే భరిస్తున్నదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్రెడ్డి వివరించారు. ఈ భాగంలో తమ వంతు పనులు వేగవంతం చేశామని తెలిపారు. చౌటుప్పల్ నుంచి అమన్గల్ – షాద్నగర్ – సంగారెడ్డి వరకు (181.87 కి.మీ.) రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించాలని ఆయన కోరారు. హైదరాబాద్ (ఓఆర్ఆర్ గౌరెల్లి జంక్షన్) నుంచి వలిగొండ – తొర్రూర్ – నెల్లికుదురు – మహబూబాబాద్ – ఇల్లెందు- కొత్తగూడెం వరకు రహదారిని (ఎన్హెచ్-930పీ) జాతీయ రహదారిగా ప్రకటించారని, ఇందులో కేవలం ఒక ప్యాకేజీ కింద 69 కి.మీ.లకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారని తెలిపారు. హైదరాబాద్ నుంచి భద్రాచలం వెళ్లేందుకు 40 కి.మీ.ల దూరం తగ్గించే ఈ రహదారిని జైశ్రీరామ్ రోడ్గా వరంగల్ సభలో నితిన్ గడ్కరీ అనౌన్స్ చేసిన విషయాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ రహదారిలో మిగిలిన మూడు ప్యాకేజీలకు (165 కి.మీ.) టెండర్లు పిలిచినందున వెంటనే పనులు ప్రారంభించాలని ఆయన కోరారు.
కల్వకుర్తి నుంచి కొల్లాపూర్–సోమశిల–కరివెన- నంద్యాల (ఎన్హెచ్-167కే) మార్గాన్ని జాతీయ రహదారిగా ప్రకటించి 142 కి.మీ.ల పనులకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారని కేంద్ర మంత్రి గడ్కరీకి సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. మిగిలిన 32 కి.మీ.ల పనులకు, ఐకానిక్ బ్రిడ్జికి టెండర్లు పిలిచారని, ఆ పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు. ఈ రహదారి పూర్తయితే హైదరాబాద్ వాసులకు తిరుపతికి 70 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని వివరించారు.
కల్వకుర్తి – నంద్యాల రహదారి (ఎన్హెచ్ -167కే), హైదరాబాద్–శ్రీశైలం మార్గంలో ఉన్న రహదారిలో (ఎన్హెచ్ 765కే) 67 కిలోమీటర్ వద్ద (కల్వకుర్తి) ప్రారంభమవుతుందని, ఎన్హెచ్ 167కే జాతీయ రహదారి పనులు చేపట్టినందున హైదరాబాద్-– కల్వకుర్తి వరకు ఉన్న (ఎన్హెచ్ 765కే) రహదారిని 2 వరుసల నుంచి 4 వరుసలుగా విస్తరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. కల్వకుర్తి–కరివెన వరకు జాతీయ రహదారి పూర్తయ్యే లోపు హైదరాబాద్–కల్వకుర్తి రహదారిని నాలుగు వరుసలుగా విస్తరణకు అనుమతివ్వాలన్నారు.
హైదరాబాద్ – శ్రీశైలం (ఎన్హెచ్ 765) మార్గంలో 62 కిలోమీటర్లు ఆమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్టు పరిధిలో ఉందని, అటవీ అనుమతులు లేక అక్కడ పనులు చేపట్టలేదని సీఎం చెప్పారు. ఈ మార్గంలో నిత్యం ఏడు వేలకుపైగా వాహన రాకపోకలు సాగుతాయని, ఈ నేపథ్యంలో ఆమ్రాబాద్ ప్రాంతంలో నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్కు అనుమతులు మంజూరు చేయాలని ఆయన కోరారు.
తెలంగాణను కర్నాటక, మహారాష్ట్రను అనుసంధానించే హైదరాబాద్ -– మన్నెగూడ నాలుగు వరుసల జాతీయ రహదారిగా (ఎన్హెచ్-163) భూ సేకరణ, టెండర్లు పిలవడం పూర్తయినా.. ఎన్జీటీలో కేసుతో పనులు ప్రారంభం కాలేదని సీఎం తెలిపారు. ఆ మార్గంలో ఉన్న మర్రి చెట్లను కేంద్ర పర్యావరణ శాఖ నిబంధనల ప్రకారం ట్రాన్స్లోకేషన్ చేసేందుకు ఎన్హెచ్ ఏఐ అంగీకరించిందన్నారు. ఇలాంటి టైమ్లో అలైన్మెంట్ మార్చడం సాధ్యం కాదని, సంబంధిత శాఖలకు తగిన ఆదేశాలు జారీ చేసి ఈ మార్గం పనులు వెంటనే ప్రారంభించేలా చూడాలని కేంద్ర మంత్రి గడ్కరీని సీఎం రేవంత్ కోరారు. సేతు బంధన్ స్కీం కింద 2023-–24లో రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన 12 ఆర్వోబీలు/ఆర్యూబీలను వెంటనే మంజూరు చేయాలన్నారు.
గత సర్కార్ నిర్లక్ష్యంతో రోడ్ల అభివృద్ధిలో జాప్యం: వెంకట్రెడ్డి
గడిచిన ఐదేండ్లలో నేషనల్ హైవేల్లో అతి తక్కువ నిధులు వచ్చింది తెలంగాణకే అని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. భూసేకరణ, ఇతర సమస్యలను పరిష్కరించకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయని తెలిపారు. దీంతో రోడ్ల అభివృద్ధి పనుల్లో జాప్యం పెరిగిందని ఫైర్ అయ్యారు. 2016 లో ఇన్ ప్రిన్స్పల్గా ఆర్ఆర్ఆర్ను ప్రకటించిన నాటి బీఆర్ఎస్ సర్కార్... 2018 లో కేంద్రంతో ఎంఓయూ కుదుర్చుకొని ఆ తర్వాత విస్మరించిందని విమర్శించారు.
అయితే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే స్పీడప్ చేశామని ఆయన తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలను కలిపే విజయవాడ – హైదరాబాద్ నేషనల్ హైవే ను రెండేండ్లలో నిర్మించబోతున్నట్లు చెప్పారు. రూ. 4 వేల కోట్లతో ఈ ఆరు లేన్ల పనులు ప్రారంభకానున్నాయని తెలిపారు. విభజన చట్టంలో పొందుపరిచినట్లు ఈ నేషనల్ హైవేకు సమాంతరంగా ఎక్స్ ప్రెస్ హైవే నిర్మించేలా డీపీఆర్ తయారు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి గడ్కరీ చెప్పారని ఆయన అన్నారు. దీంతో పాటు ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ ఎకనామికల్ డిజైన్ చేయాలని అధికారులను కేంద్ర మంత్రి ఆదేశించారని వెల్లడించారు. జగిత్యాల – పెద్దపల్లి – మంథని – కాటారం రహదారిని నేషనల్ హైవేగా గుర్తించి.. నిధులు మంజూరు చేయాలని నితిన్ గడ్కరీని కోరినట్లు మంత్రి వెంకట్రెడ్డి వివరించారు.
రాష్ట్రానికి ఆర్ఆర్ఆర్ వరం: భట్టి
రాష్ట్రానికి రీజినల్ రింగ్ రోడ్డు వరంగా మార బోతున్నదని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి సమా చారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి అందిం చి, దీనిపై సానుకూలంగా నిర్ణయం వచ్చేలా ప్రయత్నించి నట్టు చెప్పారు. అలాగే తెలం గాణకు కావాల్సిన రోడ్స్ నెట్ వర్క్ పై కేంద్ర మంత్రితో చర్చించామన్నారు. ఇందులో భాగంగా పెండింగ్లో ఉన్న రోడ్లకు అనుమ తులు, వాటికి కావాల్సిన నిధుల మంజూరును కోరామని తెలిపారు.
హైదరాబాద్- విజయ వాడ రహదారి ఆరు లేన్ల విస్తరణ, టెండర్లపై కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశామని చెప్పారు. విజయవాడ-నాగ్ పూర్, ఇతర రహదారులపై సర్వీస్, క్రాసింగ్ రోడ్లకు అనుమతివ్వాలని కోరామన్నారు. రోడ్ల అభివృద్ధికి కావాల్సిన భూ సేకరణ, నిధుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహకరి స్తామని కేంద్ర మంత్రికి హామీ ఇచ్చినట్లు మీడియాకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు.