తెలంగాణలోనూ మధ్యంతర బడ్జెటే .. సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్

తెలంగాణలోనూ మధ్యంతర బడ్జెటే ..  సీఎం రేవంత్  రెడ్డి గ్రీన్  సిగ్నల్
  • తెలంగాణలోనూ మధ్యంతర బడ్జెటే ..  సీఎం రేవంత్  రెడ్డి గ్రీన్  సిగ్నల్
  • ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని వెల్లడి
  • 2024‑25 బడ్జెట్ అంచనాలపై డిప్యూటీ సీఎంతో రివ్యూ
  • కేటాయింపులపై సీఎంకు వివరించిన అధికారులు 

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలోనూ మధ్యంతర బడ్జెట్​కు సీఎం రేవంత్​ రెడ్డి గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చారు. అయినా ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని, అందుకు సరిపడా నిధుల కేటాయింపు బడ్జెట్​లో కనిపించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఎంసీహెచ్​ఆర్డీలో శనివారం ఆర్థిక శాఖ అధికారులతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఓటాన్​ అకౌంట్​బడ్జెట్ పై చర్చించారు. ఈనెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైతే గవర్నర్​ ఆమోదం మేరకు 10వ తేదీన మధ్యంతర బడ్జెట్  పెట్టే అవకాశం ఉన్నట్లు సీఎం పేర్కొన్నారు.

కేంద్రం మధ్యంతర బడ్జెట్ పెట్టడంతో రాష్ట్రంలోనూ ఓటాన్​ అకౌంట్​ బడ్జెట్​ పెడతామని, ఆ దిశగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. మహాలక్ష్మి, రైతుభరోసా, చేయూత, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, యువ వికాసంపై చర్చించారు. ఇందులో ఐదు గ్యారంటీలకు ప్రజా పాలనలో భాగంగా కోటి 9 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. దీంతో ఏయే పథకానికి ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి, ఎంతమంది అర్హులు ఉండే అవకాశం ఉంది, నిధులు ఏ మేరకు అవసరం అవుతాయి అన్న వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు.

ఐదు గ్యారంటీల్లో ఇప్పటికే రెండు అమల్లోకి వచ్చాయని, రూ.500కు గ్యాస్​ సిలిండర్​, 200 యూనిట్లలోపు ఉచిత కరెంట్​పై ప్రతినెలా ఎంత ఖర్చు అవుతుందో చర్చించారు. మహాలక్ష్మి పథకం కోసం ఏడాదికి రూ.10 వేల కోట్లు అవసరం అవుతాయని అధికారులు వివరించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నందు దీనికి ఏటా రూ.3 వేల కోట్ల కేటాయింపులు చేయాలని అంచనా వేశారు. రూ.500కే గ్యాస్​ సిలిండర్​ స్కీమ్​ కోసం రూ.4 వేల కోట్లు అవసరం అవుతాయని, అందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని అధికారులు చెప్పారు.

ఇక రైతు భరోసా పథకానికి ఏటా రూ.22 వేల కోట్లు అవుతాయని అంచనా వేస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద రూ.5 లక్షల ఆర్థిక సాయం చేయాల్సి ఉన్నది. ఈ పథకానికి రూ.15 –20 వేల కోట్లు అవసరం అవుతాయని అధికారులు తెలిపారు. గృహజ్యోతి కింద కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్​ ప్రకటించారు. దీనికి దాదాపు రూ.4 నుంచి 5 వేల కోట్ల వరకు అవుతుందని అధికారులు సీఎం, డిప్యూటీ సీఎంకు వివరించారు. చేయూత పథకానికి రూ.20 వేల కోట్లు అవుతాయని అధికారులు పేర్కొన్నారు.