మొంథా తుఫాన్ తెలంగాణలో బీభత్సం సృష్టించింది. తుఫాన్ ధాటికి జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. చేతికొచ్చిన వరి, పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో వరి ధాన్యం కొనుగోళ్లపై రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకునేలా అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.
ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల జిల్లా కలెక్టర్లు,అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ... ధాన్యం సేకరణ కేంద్రాల దగ్గర క్షేత్ర స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై పౌరసరఫరాల విభాగం ఎప్పటికప్పుడు కలెక్టర్లకు తగిన సూచనలు చేయాలని చెప్పారు. ప్రతీ కొనుగోలు కేంద్రానికి మండల స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించి బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. అవసరమైన చోట ధాన్యాన్ని దగ్గరలోని ఫంక్షన్స్ హాల్స్ కు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి ప్రతీ 24 గంటల పరిస్థితిపై ప్రతీ రోజు కలెక్టర్ కు రిపోర్ట్ అందించాలని ఆదేశించారు. రిపోర్ట్ ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించే అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు సీఎం రేవంత్.
ప్రతీ ఒక్కరు ఫీల్డ్ లో ఉండాల్సిందేనని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ సంయుక్తంగా ఒక మానీటరింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దెబ్బతిన్న రోడ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు మానీటర్ చేస్తూ ట్రాఫిక్ ను డైవర్ట్ చేయాలని చెప్పారు చెరువులు, వాగులు, మేజర్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, లో లెవల్ కల్వర్టుల దగ్గర పరిస్థితులను గుర్తించి స్థానికులను ముందుగానే అలర్ట్ చేయాలని ఆదేశించారు. అన్ని విభాగాలు సంయుక్తంగా పనిచేయాలని సూచించారు.
